Thursday, 5 March 2015

హోలి పండుగ - వసంతోత్సవం

హోలి పండుగ - వసంతోత్సవం
కామదహనం తరువాత అంటే మన్మధుడు బూడిదపాలు అయిన తరువాత రతీ దేవీ పరమ శివున్ని తన భర్తని బతికించమని వేడుకొనగా పరమ శివుడు దయతో మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. మన్మధునికి మరో పేరే మదనుడు. అందుకే ఇది మదనోత్సవం, మధూత్సవం అన్న పేర్లతో కూడా పిలువబడుతోంది.
కాముని పున్నమి.. కామదహనం. వసంతోత్సవం. ఫల్గుణోత్సవం. డోలికోత్సవం.. హోలికాపౌర్ణమి. మదనోత్సవం. మధూత్సవం.. ఇలా ఎన్ని పేర్లున్నా చివరికి అందరి నోళ్లలోనూ నానే పేరు మాత్రంహోలి’. ఫాల్గుణమాసంలోశుక్ల పూర్ణిమనే హోలి పండుగగా జరుపుకుంటాం.
దేవతలందరూ వసంతోత్సవం జరుపు కుంటారు అదే హోళీ పండుగ. ఈరోజే బ్రహ్మసావర్ణి మన్వాది కూడా. అంటే బ్రహ్మ సావర్ణి దేవీ ఉపాసనతో మనువుగా వరం పొందిన గొప్ప రోజు.

కామదహనం వసంతోత్సవం
 ఒకానొక సమయములో కైలాసములో శివుడు , సతీ దేవీ ఉండగా దేవతలందరు కలిసి అటుగా ప్రయాణము అవుతున్న దృశ్యం వారికి కనిపించింది. వీరంతా ఎక్కడకు వెళుతున్నారని వాకబు చేయగా వారంతా దక్షయజ్ఞానికి వెళుతున్నట్లు తెలుస్తుంది. సతీ దేవీ ఆశ్చర్యపడి, తన తండ్రి గారు విషయం తమకు ఎందుకు తెలుపలేదా అని అనుకున్న సమయంలో, పరం శివుడు దక్షుడు తమను కించపరుస్తున్నాడని, తమను ఆహ్వానించలేదని తెలపటం, అయినా సతీ దేవీ అక్కడకు వెళ్లి అవమానం భరించలేక ఆత్మాహుతీ అవ్వటం మనకు తెలిసిన విషయమే. అంతేకాక శివుడు సతీ దేవీ ఆత్మాహుతి వార్త విని రుద్రుడై, కాలభైరవుణ్ణి సృష్టించటం, అతడు యజ్ఞాన్ని సర్వనాశనం చెయ్యటం జరిగింది. తరువాత శివుడు సతీదేవీ వియోగంతో కృంగి ఘోరతపస్సులోకి వెళ్ళటం జరిగింది. శివ జాడలేదని గ్రహించిన రాక్షసులకు ఒక పండుగగా మారి వారు చేసే దుశ్చర్యలకు ఎదురులేకపోయింది. దేవతలకు విషమ పరిస్థితులు ఎదురయ్యాయి, వారికి ఏమిచెయ్యాలో పాలుపోని స్థితిలో అందరు ఆలోచించి, విరాగి అయిన శివుణ్ణి తపస్సు నుంచీ తప్పించి, వారి దృష్టిని మరల్చాలని ఆశించి, దానికి ఒక్క మన్మదుడే దిక్కని తోచి మన్మధుడిని ప్రేరేపించి, శివుడి మీద మన్మధబాణాలేసి వారి దృష్టిని మార్చాలని కోరారు. దేవతలంతా విధంగా కోరగా, మన్మధుడు ఇక వారి మాట వినక తప్పలేదు. అదే తడవుగా మన్మధుడు శివునిపైకి బాణాలు వెయ్యటం జరిగింది. తీవ్ర తపస్సులో వున్నా శివుడి తపస్సుకి భంగం కలిగింది. అతిరుద్రుడై కళ్ళు తెరచి చూశాడు, మన్మధుడు వరుసగా బాణాలు విసురుతున్నాడు. శువుడికి విపరీతమైన కోపం కలిగింది, క్షణాల్లో ఏం జరిగిందో ఉహించేలోగా శివుడి కోపాగ్నికి మన్మధుడు బూడిదవ్వడం జరిగిపోయింది. అంటే తన కోపాగ్నికి కామ స్వరూపుడైన మన్మధుడిని బూడిద చెయ్యడం జరిగింది. ఆనాడే కామదహనం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. మాగః శుక్ల త్రయోదశినాడు జరిగినదీ కామదహనం అనగా మన్మధదహనం. మానవ జీవితానికి కోరికలే మొదటి శత్రువులు. కోరికలను కలిగించు కాముడే మన్మధుడు. శివునిచే జరిగిన కామదహనం అంటే తన కోపాగ్నికి కామ స్వరూపుడైన మన్మధుడిని బూడిద చెయ్యడం జరిగింది. ఆనాడే కామదహనం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. మాగః శుక్ల త్రయోదశినాడు జరిగినదీ కామదహనం అనగా మన్మధదహనం. మానవ జీవితానికి కోరికలే మొదటి శత్రువులు. కోరికలను కలిగించు కాముడే మన్మధుడు. శివునిచే జరిగిన కామదహనం పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఆచారంగా మారింది. కామదహనం జరిగిన తరువాత మన్మధుని భార్య అయిన రాతీదేవీ వచ్చి విషయం తెలుసుకొని తన భర్త భాస్మంగా మారడం చూచి దిగ్భ్రాంతి చెంది తన భర్త కోసం శోకించటం మొదలుపెట్టింది. దేవతలందరినీ పిలిచి మీరేనా నా భర్తను శివునిపైకి పంపారు. ఇప్పుడు ఇలా అయ్యింది. అంటూ భాధపడింది. దేవతలందరూ రతీదేవిని తీసుకొని శివుని దగ్గర చేరి ప్రార్ధించి తిరిగి మన్మధుని బతికించారు. మన్మధునికి శరీరం లేకపోయినా ఆయన చెయ్యవలసిన బాధ్యతలు అంటే దేవతలలు మానవులకు కోరికలు ప్రేరేపించడం జరుగుతుందని భార్య రాతీదేవికి మాత్రం శరీరంతోనీ కనిపిస్తాడని శివుడు వరం ఇచ్చాడు. అలా కాముడైన మన్మధుడు తిరిగి బ్రతికినందుకు వసంతోత్సవం ఆనందంతో చేసుకున్నారని అదే హోలీ అనీ, అదే వసంతోత్సవం అని అంటాము. ఆనాడు రతీమన్మధులను పూజిస్తే కుటుంబానికి సౌభాగ్యం ఆనందం కలుగుతుందని నమ్మకం.
        
మరొక కథ
హోలికను గురించి మరో కథ ప్రచారంలో వుంది. కృతయుగంలో రఘునాదుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఎంతో జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ వుండగా కొందరు ప్రజలు వచ్చి హోలిక అను రాక్షసి వచ్చి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకున్నారు. సమయములో అక్కడే వున్న నారద మహర్షి రఘునాధ మహారాజా హోలిక అను రాక్షసిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ రోజు పూజించాలి. అలా పూజించిన వారి పిల్లలను రాక్షసి ఏమీ చెయ్యదు . కనుక రాజ్యంలో అందరిని వచ్చే ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలికను పూజించమని ఆదేశించండి, అన్ని బాధలు తొలగిపోతాయి అన్నాడు. రాజ్యములోని ప్రజలందరూ ఫాల్గుణ పూర్ణిమ రాత్రి కాలమందు బిడ్డలను ఇంటిలోనే ఉంచి హోలికకు పూజలు చెయ్యాలని మహారాజు ఆదేశించాడు. పగటిపూట పూజ చేసిన వారికి దుఃఖములు కలుగుతాయి. కనుక హోలికకు రాత్రే పూజలు చేయాలి. అలా హోళీ ..... హోలిక పూజ వాడుకలోకి వచ్చిందని తెలుస్తోంది. హోలిక హిరణ్య కశిపుని చెల్లెల్ని, ప్రహ్లాదుని అగ్నిలో తోయించినప్పుడు ప్రహ్లాదునితోపాటు హోలిక కూడా అగ్నిలో ప్రవేశించి మారి భస్మం అయ్యిందని అందువల్ల పిల్లల రక్షణ కొరకు ఆమెను పూజించడం ఆచారంగా మారిందని పెద్దలు చెప్తారు.

హోలికి సంబంధించిన మరొక ప్రస్తావన
శ్లో   :     సరోడోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం
            ఫాల్గుణ్యాం సంయతో భూత్వా గోవిందస్యపురం ప్రజేత్. ||
పరమాత్ముడైన శ్రీ కృష్ణుడు రోజే ఉయలలలో ప్రవేశించాడని ఫాల్గుణ పూర్ణిమనాడు ఉయలలోని కృష్ణుని పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
 హోళీ అనే పదం డోల అనే పదానికి ప్రతీకమని అలా హోలి పండుగగా ప్రసిద్దమైనదనీ మరి కొందరు అంటారు. ఏదేమైనా కామదహనం తరువాత జరిగే హోళీ వసంతోత్సవం ఇంత ప్రాచుర్యాన్ని సంతరించుకొని జాతి సమక్యైతను దారి తీసే విధంగా అందరిని ఆనందిమ్పచేస్తోంది. కాబట్టి తప్పక ఆచరింప తగిన పండుగ, ఇది జాతి, మత, స్త్రీ, పురుషుల వయో భేదం లకుండా కలిసిపోయి ఆనందంగా జరుపుకునే పర్వదినం.

  ఈ పండుగ గురించి శ్రీ మద్భాగవతంలో ఒక ఘట్టం ఉంది (క్లుప్తంగా చెప్పుకుందాం) :-
హిరణ్యకశిపుడనే వాడు రాక్షసులకు రాజు. ఇంట్లో లేదా బయట, పగులు లేక రాత్రి సమయంలో కానీ, మనిషి లేదా మృగం చేత కానీ, భూమి లేక ఆకాశంలో కానీ, రోగాల వలన, ఆయుధముల వలన తనకు మరణం ఉండరాదని బ్రహ్మ దేవుని వద్ద వరం కోరుతాడు. వరం పొంది తనను ఎవరు ఏమీ చేయలేరన్న అహకారంతో యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తాడు. గోశాలలను, పోలాలను, అడవులను, ఉద్యానవనాలకు నిప్పు పెట్టిస్తాడు. జనాలను అష్టకష్టాలు పెడతాడు. స్వర్గలోకం మీద దాడి చేసి ఇంద్రుడి ఆధిపత్యానికి విఘాతం కలిగిస్తాడు. తానే దేవుడినని, తననే పూజించాలని ప్రజలకు ఆజ్ఞ ఇస్తాడు.

శ్రీ మహావిష్ణువంటే హిరణ్యకశిపుడికి మహాద్వేషం.
ఈయన పుత్రుడే "ప్రహ్లాదుడు". ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఎల్లప్పుడు విష్ణు నామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు సజీవంగా అగ్నిలో పడేసి ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు.

హిరణ్యకశిపుడికి హోలికా అనే సోదరి ఉంది. సజ్జనులకు(మంచివారికి) అపకారం కలిగించనంతవరకు ఈమెకు అగ్ని వల్ల ప్రమాదం ఉండదని వరం ఉంది. ప్రహ్లాదుడు అగ్నిలోంచి పారిపోకుండా ఉండడానికి అగ్ని జ్వాలల మధ్య హోలికను కూర్చోబెట్టి, హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెడతారు. ప్రహ్లాదుడు మాత్రం భయపడకుండా విష్ణు నామన్ని జపిస్తూ హాయిగా కూర్చుంటాడు. తనని కాపాడమని కూడా విష్ణువును ప్రార్ధించడు.
ఎందుకంటే నమ్ముకున్న వారిని రక్షించడం పరమాత్ముడు బాధ్యత. ప్రత్యేకించి అడగాల్సిన అవసరం లేదు. "నా మే భక్తః ప్రణశ్యతి", నన్ను పూర్తిగా నమ్మినవారు ఎన్నటికి పరమాత్మే తన గురించి గీతలో చెప్పాడు. అసలు భక్తి అంటే అవ్యాజయమైన ప్రేమ. నేను నమ్మాను కనుక నన్ను దైవం రక్షించాలి, నన్ను ఉద్ధరించాలి అని నిజమైన భక్తుడు కోరుకోడు. నాకు ఏది మంచో అది నా దేవుడు ఇస్తాడని కష్టాలను సైతం ఎదురుకుని పరమాత్ముడిపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. అందుకే  ప్రహ్లాదుడు ప్రత్యేకించి రక్షించమని అడగలేదు.

పరమాత్ముడి అనుగ్రహం ప్రసరించింది. హిరణ్యకశిపుడి ఆలోచన బెడిసికొట్టింది. అగ్ని ప్రహ్లాదుడికి చిన్న అపకారం కూడా చేయలేదు. కానీ హోలిక అగ్నిజ్వాలలకు మాడి మసైపొయింది. పసివాడు, పరమభాగవతుడైన ప్రహ్లాదుడు చిరునవ్వులు చిందిస్తూ అగ్ని నుండి బయటకు వచ్చాడు.

మన చరిత్రలో జరిగిన సంఘటనకు చిహ్నంగా మనం హోలికా దహనాన్ని చేసి హోలి జరుపుకుంటాం.
సజ్జనులు, తపస్వులు, సత్యవంతులైన భగవత్భక్తులకు అపకారం చేయదలిస్తే సర్వనాశనమవుతారని, భగవంతుడుని నమ్ముకున్న వారు సదా రక్షింపబడతారని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మాత్రమే

  వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ


No comments:

Post a Comment