అయినవోలు
శ్లో||
ఐనవోల్ గ్రామవాసాయ | శర్వాయ శశిమౌళియే||
శ్రీమన్మైలారుదేవాయ
శుభదాయాస్తు మంగళమ్.
అయినవోలు
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని గ్రామము. అయినవోలు వరంగల్లు నుండి 12 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ కాకతీయులు కట్టించిన
మల్లికార్జునస్వామి ఆలయం అయినవోలు మల్లన్నగా
ప్రసిద్ధి చెందినది.
చరిత్ర
క్రీ.శ.1118లో
త్రిభువనమల్ల బిరుదాంకితుడైన, పశ్చిమ చాళుక్య రాజు, ఆరవ విక్రమాదిత్యుడు,
దండనాయకుడైన సూరయ్య (అయ్యన్నమరస)కు అయ్యనవోలు సూరేశ్వర
దేవుని నిత్యారాధనకు, బిక్షుకుల నిత్యాన్నదాన నిమిత్తం భూదానం చేసినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఈ అయ్యనచే నిర్మింపబడి
అయ్యన్నప్రోలుగా పిలువబడి, ప్రస్తుతం ఐనవోలుగా రూపాంతరం చెందింది.
మైలారదేవుని ఆలయాన్ని కాకతీయ రాజు రెండ ప్రోలుని
కుమారుడు రుద్రదేవుడు నిర్మించాడని సిద్ధేశ్వర చరిత్ర వల్ల తెలుస్తున్నది. ఆలయానికి
తూర్పు మరియు దక్షిణ దిశలలో
రెండు కీర్తితోరణాలను కాకతీయ రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణానికి పూర్వమే
ఇక్కడ నిర్మింపజేశాడు. అందుకు తార్కాణంగా ఇదే శైలిలో నిర్మింపబడిన
కాకతీయ కీర్తితోరణాలను ఈ నాటికీ మనం
ఓరుగల్లు కోటకు నాలుగు దిక్కులా
చూడవచ్చును. అయితే ఓరుగల్లులోని కీర్తితోరణాల
శిల్పనిర్మాణ శైలి, సౌందర్యం చాలా
పరిణతి చెంది ఎంతో అద్భుతంగా
ఉంటుంది. ఇంతటి శిల్పసౌందర్యం ఐనవోలు
తోరణాలలో మనకు కనిపించదు. అయితే,
ఐనవోలు దేవాలయానికి శిలాతోరణాలను నిర్మించడం వెనుక ఒక కథను
ఉటంకిస్తారు. అదేమంటే, కాకతీయ ప్రోలరాజు ఒకరోజున వేయిస్థంభాల దేవాలయంలో, నిద్రలో ఉన్న తనకుమారుడు రుద్రదేవుణ్ణి
పుత్రవాత్సల్యంతో స్పృశించగా, మగతనిద్రలో ఉన్న రుద్రదేవుడు, తనను
ఎవరో శత్రువులు చంపడానికి వచ్చినారని భావించి, తన మొలలోఉన్న కైజారును
తీసి రుద్రదేవుణ్ణి పొడుస్తాడు. తండ్రి చావుకు కారకుడనైనానన్న పాపభీతితో ఐనవోలు ఆలయానికి శిలాతోరణాలను నిర్మింపజేశాడు. ఈ అంశం,1935వ
సం.లో మారేమండ రామారావు
సంపాదకత్వంలో వెలువడిన కాకతీయ సంచికలో పేర్కొనబడినది.
ఐనవోలు
మల్లన్న
12వ శతాబ్దంలో మైలార
లేదా మల్లారి దేవుని ఆలయంగా నిర్మింపబడిన ఈ ఆలయం, ఆ
తరువాత కాలంలో మల్లన్న, మల్లిఖార్జున ఆలయంగా రూపాంతరం చెందింది. క్రీ.శ.1369 లో
ఐనవోలు ఆలయ ప్రాంగణంలోని ఒక
స్తంభంపై రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన సింగమనాయకుని కుమారుడు, అనపోత చెక్కించిన సంస్కృతాంధ్ర
దాన శాసనంలో మల్లరి వృత్తాంతము వర్ణించబడిండి. అర్జునున్ని కాపాడటానికి శివుడు ఒక శబరుని వేషం
ధరించి, మల్ల అనే రాక్షసున్ని
సంహరించాడు. అలా మల్ల+అరి=మల్లరి అన్న పేరు తెచ్చుకున్నాడు.
మల్లరి అనే పేరు కాలక్రమంలో
మైలార అయ్యింది.
స్వామివారి రూపం భీకరంగా పది
అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, కోరమీసాలతో
ఉంటుంది. చతుర్భుజాలు కలిగి నాలుగు చేతులలో
ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు గొల్ల కేతమ్మ, బలిజ
మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. కుడి పాదం క్రింద
మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి-మల్లాసురుల శిరస్సులుంటాయి.
ఈస్వామివారిని మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేల్ రాయుడు అని పిలుస్తారు. ఆలయంలో
ఉన్న శివలింగం అర్థప్రాణవట్టంపై ఉన్నది. ఇది అరుణ వర్ణంలో
ఉంటుంది. కుజ గ్రహానికి అధిష్టాన
దైవతం. శివలింగంపై పార్థప్రహారం స్పష్టంగా కనిపిస్తుంది.
బ్రహ్మోత్సవాలు
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతాయి. ఇవి పాంచాహ్నిక దీక్షతో,
అయిదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథారూఢుడై పురవీధి సేవకు బయలుదేరుతాడు. అయిదవరోజున
ప్రాతః కాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి,
శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతీ మాసశివరాత్రి రోజున
మహన్యాసపూర్వకరుద్రాభిశేకం,
శాంతికల్యాణం, రుద్రహోమం జరుగుతాయి.
ప్రధానంగా మల్లన్న యాదవుల, కురుమల ఇష్టదైవం. ఇది ప్రముఖమైన జానపదుల
జాతర. సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు
ప్రతి ఆది, బుధవారాల్లో జరుగుతుంది.
'బోనం' అనే ప్రత్యేక వంటకాన్ని
కొత్త కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు.
అనంతరం 'ఒగ్గు పూజారులు 'గా
వ్యవహరింపబడే కురుమ పూజారులు, ఢమరుకాన్ని
వాయిస్తూ, నేలపై రంగురంగుల ముగ్గులనువేసి,
జానపద బాణీలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. దీన్ని పట్నం వేయడం అంటారు.
ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే
స్వామివారికళ్యాణం. ప్రతీ మాస శివరాత్రిరోజున
నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను
ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు.
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment