“అక్షయ తృతీయ”
వైశాఖ శుద్ధ తృతీయ నాడు
కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ
తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే
మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు
జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.
మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం
ప్రకారం..ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం
గూర్చి చెప్పారు. వైశాఖ శుద్ధ తదియ
నాడు చేసే ఏ వ్రతమైనా,
జపమైనా, హోమం, దానాదులేవైనా లేక
పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది.
(పుణ్య కార్యాచరణం వల్ల వచ్చే ఫలితం
అక్షయమైనప్పుడు పాపకార్యాచరణం వల్ల వచ్చే పాపం
కూడా అక్షయమే అవుతుందిగా... ). ఈ నాడు, తృతీయా
తిథి బ్రహ్మగారితో కలిసి ఉంటుంది. అందుచే
విశేష పూజనీయమైనది. ఈ నాటి ఉపవాస
దీక్ష జరిపి ఏ పుణ్య
కర్మమాచరించినా కూడా తత్సంబంధఫలము అక్షయముగానే
లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన
విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని
పేరు. ఈ రోజు అక్షతోదకముతో
స్నానం చేసి, అక్షతలను విష్ణు
భగవానుని పాదములపై ఉంచి అర్చించి, తరవాత
ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి,
మిగిలిన వాటిని దైవోచ్ఛిష్ఠంగా, బ్రాహ్మణోఛ్ఛిష్ఠంగా తలచి వాటిని ప్రసాద
బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి
ఈ ఫలం తప్పక కలుగుతుంది
అని పురాణంలో ఈశ్వర వాక్కు.
ఇలా ఒక్క వైశాఖ శుక్ల
తదియనాడు పైన చెప్పిన విధంగా
నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని
ఆచరించిన తరవాత వచ్చే 12 మాసాలలో
శుక్ల తృతీయ నాడు ఉపవసించి
విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము
కలిగి అంత్యమునముక్తిని పొందగలడు. (అక్షతలు అంటే ఏ మాత్రము
విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న
బియ్యము, అవి వరి ధాన్యము
నుండి కావచ్చు, గోధుమ ధాన్యమునుండి కావచ్చు,
యవల నుండి కావచ్చు. ఇటువంటి
వాటితో సిద్ధం చేసిన ఆహారముని అక్షతాన్నము
లేదా అక్షతాహారము అంటారు) శ్రీ నారద పురాణం
కూడా, ఈ నాడు చేయు
దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెప్తోంది.
ఈ నాడు దానం ధర్మం
చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే,
ఇక గంగా తీరంలో ఈ
నాడు దానాది ఫలములు నారదమహర్షి ఇలా చెప్పారు. అక్షయ
తృతీయ నాడు గంగా తీరంలో
నియమంతో ఘ్రుత ధేను దానం
చేసినవాని ఫలితం ఇంతింత కాదు,
సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై బంగారము, రత్నములతో కూడి చిత్ర హంసలతోకూడిన
విమానములో తన పితృదేవతలతో కల్పకోటి
కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున
విరాజిల్లును. తరవాత గంగా తీరంలో
అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మ జ్ఙానియై ముక్తిని పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము
చేసినవాడు గోలోమ సంఖ్యలు ఎన్నిఉన్నాయో
అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్ల తరవాత భూమిమీద పుట్టి
చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు. గంగా నది ఒడ్డున
వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో
నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని
చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత
భూమిని దానం చేసాడో అంతభూమిలోని
రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు
శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాదిపతి అగును.
అతడు నిద్రించినచో భేరీ శంఖాది నినాదములచే
మేల్కొలపబడును. సర్వ ధర్మ పరాయణుడైసర్వ
సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న
పితరులనందరినీ స్వర్గమున చేర్చి స్వర్కమున నున్న పితరులనందరినీ మోక్షమున
చేర్చి స్వయముగా జ్ఙానియై అవిద్యను జ్ఙాన ఖడ్గముచే ఖండించగల
పరమ వైరాగ్యముని పొంది పరబ్రహ్మమును పొందెదడు.
ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.
ఈ తిథినాడు పదహారు మాస మితమగు (పదహారు
మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము
వాడు అన్ని లోకములందు పూజ్యుడై
విరాజమానుడగును.
దీనివల్ల తెలిసేదేమంటే బంగారం కొంటే అక్షయం కాదు,
ఈ రోజు చేసే ధర్మకార్యాలు,
ఉపాసనలు, దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి
అని.తెలియని వారికి ఇది తెలియ చెప్పండి.
ఈ నాడు డబ్బులు లేకున్నా
అప్పు చేసిబంగారం యొక్క డిమాండు పెంచి
తద్వారా ధర పెంచి, దేశ
ఆర్థిక పరిస్థులను,వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను ఇన్ఫ్లేషన్ పేర ఇబ్బంది పాలు
చేయకండి.
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment