Wednesday, 17 February 2016

శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి

http://www.vipravanam.com/
     అధునాతన సమాజంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టి, హేతువాదిగా ఉన్న నరేంద్రుని దృష్టికోణం మార్చి వివేకానందునిగా అందించిన మహాప్రవక్త, పరమరుషి రామకృష్ణపరమహంస. ఆధ్యాత్మ చింతనకే జీవితాన్ని అంకితం చేసిన వాడు, కాళిమాత చరణారవింద సంసే వనా భాగ్యోపేతుడు రామకృష్ణ. ఆలిలోనూ అమ్మను చూడగలిగిన పరమభక్తి పరిపూర్ణుడు రామకృష్ణ.
     1836 ఫిబ్రవరి18 పశ్చిమబెంగాల్లోని హుగ్లీజిల్లా కామార్పుకూర్లో జన్మించాడని, కొస్సీపూర్వనాంతర గృహంలో 1886 ఆగస్టు16 50 యేట శరీరత్యాగం చేశాడని అనుకోవడమే తప్ప అంతటి మహనీయుడికి జననమరణాలుంటాయా? జనన మరణాలు, ప్రపంచయాత్రలు పాంచభౌతిక శరీరానికే తప్ప అటువంటి దివ్యాత్మకుల కుంటాయా? 19 శతాబ్దంలో పశ్చిమబెంగాల్లో జరిగిన సాంస్కృతిక పునరుజ్జీవనం పైనే కాదు యావత్ప్రపంచం పైనా తన ప్రభావాన్ని బలంగా వేసిన రామకృష్ణ పరమహంస కన్నా గొప్ప సర్వమత సమతా వాది మరొకడు కానరాడు. పార లౌకికచింతనలో నిత్యం తన్మయమై ఉన్నా ఆయన బోధనలలో లౌకికవాద సారం తొణికిసలాడుతుంటుంది. ఆయన భావనలు నిత్యాలు-వాక్కులు సార్వకాలిక సత్యాలు.
     తండ్రి క్షుదీరామ్‌, తల్లి చంద్రమణి అని చెప్పుకోవ డమే తప్ప శరీర వ్యామోహమే లెనివానికి గదాధర్ఛటోపాధ్యాయ నామకరణం చేసినా అది నిలుస్తుందా? ధార్మిక ప్రపంచం దాన్ని తలుస్తుందా? అలౌకిక జీవనం గడిపేందుకువచ్చిన రామకృష్ణునికి బడిచదువులు వంట పట్టలేదు. వడుగుచేసుకుంటే ప్రథమ భిక్షను ఒక శూద్ర యువతి నుంచి అందుకుని సంచలనంరేపిన సంఘ సంస్కర్త. హిందూమతం లోతులు తెలుసుకునేందుకు ఇతర మతాలనూ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన విశాల హృదయుడు రామకృష్ణపరమహంస. తెలుసుకునే కొద్దీ తెలుస్తుంది మనకు తెలియనిదేమిటో అన్న నానుడిని నిజం చేసిన వాడు, అందరికీ అన్ని మతాల హృదయం అందేలా అనుగ్రహభాషణలు చేసినవాడు రామకృష్ణ పరమహంస. ధార్మిక గురువులు తోతాపురి నుంచి నిర్వి కల్పసమాధిస్థితిని, భైరవి బ్రాహ్మణినుంచి భక్తిభావంలో భగవత్సాక్షాత్కారం పొందే విధానాన్ని గ్రహించినా ఆయనలోని ధార్మిక దాహం అంతటితో చల్లారలేదు. క్రైస్తవం, ఇస్లాం మతాల సారాన్ని మనసునిండా గ్రోలే వరకు ఆయన శోధన ఆగలేదు. కామార్కపూర్లో పుట్టినా కామాది విరహితమైన ఆత్మస్థితి పట్టువడింది. అయిదేళ్ళ వయసులోనే రామకృష్ణుని జీవితభాగస్వామి గా వచ్చిన శారదను బాలాత్రిపురసుందరి అవతారంగా భావించి ఆరాధించి ఆలిహోదా నుంచి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళాడు. అందుకే వారి వైవాహిక జీవితంలో శరీరాపేక్ష ప్రసక్తే ఉత్పన్నం కాలేదు. వారి కాపురం రెండు మనసుల సహవాసంగా సాగిందే తప్ప రెండు శరీరాల సహజీవనంగా సాగలేదు.
     భారతదేశానికి ఒక ఆకారమిచ్చి దేశమాతను అమ్మ వారితో సమానమని వర్ణించిన ఘనత రామకృష్ణులకే దక్కుతుంది. జాతీయోద్యమంలో భారతమాత బ్రిటిష్వారి ఉక్కుపాదాలకింద నలిగిపోతోంది, పరాయిమూక లకు దాస్యం చేస్తోందన్న ఆలోచన తరం వారిని ఉడికించింది. రక్తం మరిగించింది. రామకృష్ణ పరమ హంస బోధనల్లో సామాజికాంశలు, మానవతా విలువలు, సంఘసంస్కరణ ధోరణులుంటాయి. కనుకనే ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన అధ్యాత్మ యోగి అయినా ఆయనపై కులం, మతం ప్రభావం మాత్రం పడలేదు.
     శరీర విసర్జనకు ఏదో ఒక కారణం కావాలి కనుక క్యాన్సర్ఒక కారణంగా ఆయన శరీరంలోకి ప్రవేశిం చింది. 1885 డిసెంబర్‌ 11 రామకృష్ణునికి తీవ్రమైన గొంతునొప్పి వచ్చింది. అదే క్రమంగా క్యాన్సర్గా బైట పడింది. ఆయనకు చికిత్స చేసేందుకు శ్యాంపుకూర్లో పెద్దపెద్ద వైద్యులంతా ప్రయత్నించి విఫలమయ్యారు. 1885 డిసెంబర్‌11 ఆయనను కాసిపూర్కు వైద్యాల యానికి మార్చారు. శిష్యులు, ఆయన సతీమణి శారదా దేవి సపర్యలు చేశారు.
గొంతు క్యాన్సర్ముదిరి రామ కృష్ణులు విపరీతంగా బాధపడు తుండేవారు. ఎట్టిపరిస్థితి లోనూ ఎవ్వరితో మట్లాడ వద్దని వైద్యులు సలహా ఇచ్చారు. అయినా రామ కృష్ణులు మాట్లాడ్డం మానలేదు. తన వద్దకు వచ్చిన వారికి హితవు చెప్పకుండా ఉండనూ లేదు. ఆఖరిరోజులు సమీపించిన సమయంలో వివేకానందుని పిలిచి తన ఆధ్యాత్మశక్తిని ఆయనలో నిక్షిప్తంచేశారు. తన తరువాత వివేకానందుడు తన ఆలోచనా సంవిధానాన్ని కొనసాగిస్తాడని, అంతా ఆయనకు సహకరించాలని కోరారు. శిష్యులను జాగ్రత్తగా చూడాలని, తన బోధనలను భవిష్యత్తు లోనూ వారికి వినిపిస్తూ నిరంతరచైతన్యమూర్తులుగా వారిని తీర్చిదిద్దాలని కోరారు. కాశీపూర్తోట గృహంలో వివేకా నందకు అధికార పగ్గాలు అప్పగించి 1886 ఆగస్ట్‌ 16 తెల్లవారుఝూమున బ్రహ్మైక్యం చెందారు. రామ కృష్ణులు మహాసమాధిలోకి వెళ్లారని ఆయన శిష్యులు విశ్వసిస్తారు.
     ఆగస్ట్‌ 16 దివ్యసమాధి చెందిన రామకృష్ణ పరమ హంసకు వివేకానందుడుకాక 16 మంది శిష్యులు ఉండే వారు. గంగానది ఒడ్డున గల బారానగర్లో సగంసగం కూలిన పాతకాలపు ఇంట్లో రామకృష్ణుని వారసునిగా వివేకానంద తన కార్యకలాపాలు ప్రారంభించాడు. ఆయనకు ఇంటాయన, మరికొందరు శిష్యులు ఆర్థిక సాయం అందించారు. రామకృష్ణుని పేరిట తొలి ఆశ్రమం ఇదే! తరువాత రామకృష్ణుల విచారధార విశ్వవ్యాప్తమయ్యే కొద్దీ శాఖోపశాఖలుగా విస్తరించింది. నిస్వార్థ సేవకు, నిరంతర నైతిక విలువల ప్రబోధలకు రామకృష్ణుని ఆశ్రమాలు పెట్టింది పేరు. రామకృష్ణుని బోధనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు రామకృష్ణ మిషన్‌, రామకృష్ణులు ప్రారంభించిన సన్యాసి జీవన విధానాన్ని కొనసాగించేందుకు రామకృష్ణమఠం ప్రారంభించాడు. రామకృష్ణుల పేరుతో సంస్థలుస్థాపించి వివేకానందుడు తన నిస్వార్థబుద్ధిని చాటుకున్నాడు. వివేకానందుడు రామకృష్ణుని ఆత్మపుత్రునిగా, ధార్మిక జీవనానికి వారసుడిగా మిగిలి తిరుగులేని, ఎవ్వరూ తిరగరాయలేని చరిత్ర సృష్టించాడు. పరమ తత్వ వేత్తగా, మహామహోపాధ్యాయునిగా ప్రపంచ ప్రజల నీరాజనాలందుకున్నాడు. అన్ని మతాల సారం ఒక్కటే. మానవసేవే మాధవసేవ.. భగవంతుని చేరేందుకు భిన్న మతాలు విభిన్న మార్గాలు అంటూ ఆయన చేసిన బోధనలు చిరస్మరణీయాలు...అందరికీ ఆచరణీయాలు.
    వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ


No comments:

Post a Comment