లక్ష్మీపూజ విశిష్టత
దీపం శ్రీ లక్ష్మీదేవి స్వరూపం
... అనేక దీపాల నడుమ ఆ
తల్లికి ఆహ్వానం పలకడమే దీపావళి. సాధారణంగా అమావాస్య రోజున శుభ సంబంధమైన
కార్యక్రమాలు చేపట్టరు. కానీ ఈ అమావాస్యని
'మహానిశి'గా భావిస్తుంటారు. లక్ష్మీదేవిని
ఆరాధించడానికి ... ఆమె అనుగ్రహాన్ని సంపాదించడానికి
ఇది అత్యంత పవిత్రమైన ముహూర్తంగా పేర్కొంటారు. ఈ సమయంలో లక్ష్మీదేవిని
పూజించడం వలన సకల శుభాలు
కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ మహానిశి వేళలోనే అమ్మవారు తన కరుణాకటాక్ష వీక్షణాలను
ప్రసరింపజేయడానికి బయలుదేరుతుంది. ఇతరులకి హానికలిగించని విధంగా ఎవరైతే జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారో,
ఏ ఇంట నిత్యం దైవారాధన
జరుగుతూ వుంటుందో అమ్మవారు ఆ ఇంటి దగ్గర
ఆగుతుంది. తాను ప్రసాదించే దానిలో
ఇతరులకి సహాయపడే గుణం కలిగినవారి ఇంటి
వాకిట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అనునిత్యం ఏ ఇల్లు పచ్చనితోరణాలతో
.. చక్కని ముగ్గులతో .. పసుపు కుంకుమల అలంకరణలతో
కళకళలాడుతూ వుంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు
ప్రవేశించి అక్కడ లక్ష్మీకళను ఉంచుతుంది.
అందువలన ఈ రోజు ఉదయాన
పూజా మందిరాన్ని పూలమాలికలతో అలంకరించాలి. పూజామందిరం ఎదురుగా చెక్కపీట వేసి దానిపై పసుపు
రంగు వస్త్రం పరిచి దానిపై స్వస్తిక్
గుర్తు గీయాలి. స్వస్తిక్ గుర్తుపై రాగిచెంబును కలశంగా వుంచి ... ఆ కలశంలో కొన్ని
నీళ్లు పోసి అందులో కొన్ని
గులాబీ రేకులు ... కొన్ని సగ్గుబియ్యం ... రెండు నాణాలు వెయ్యాలి.
కలశంపై కొబ్బరిబొండాం వుంచి దానికి స్వస్తిక్
గుర్తుపెట్టాలి. ఆ తరువాత పసుపు
గణపతిని తయారుచేసి ... దీపారాధన చేసి పూజ ప్రారంభించాలి.
అమ్మవారి వెండి ప్రతిమను పంచామృతాలతో
అభిషేకించి ఆ తరువాత మట్టి
ప్రమిదల్లో 12 దీపాలను నువ్వుల నూనెతో వెలిగించాలి. తామరపువ్వులతోను .. బంతులతోను .. గులాబీలతోను .. పసుపు అక్షింతలతోను అమ్మవారిని
పూజించాలి. ఆ తల్లికి నువ్వులతో
చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. తమకి ఆయురారోగ్య ఐశ్వర్యాలను
ప్రసాదించమని అమ్మవారిని కోరుకోవాలి.
పూజ పూర్తయిన తరువాత అక్షింతలను తలపై ధరించాలి. ఈ
విధంగా అమ్మవారిని సంతోషపెట్టడం వలన, కోరిన వరాలను
ప్రసాదిస్తుందని అంటారు. ఈ రోజున అమ్మవారు,
ధనలక్ష్మి .. ధాన్యలక్ష్మి .. ధైర్యలక్ష్మి .. విద్యాలక్ష్మి .. విజయలక్ష్మి .. సంతాన లక్ష్మి .. రాజ్యలక్ష్మి
.. వీరలక్ష్మి రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్
వరంగల్ శాఖ
No comments:
Post a Comment