శ్రీ
మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఉగాది
ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి
రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర
మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ
వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ,
నక్షత్ర, రుతు, మాస, వర్ష,
వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది
పెద్దల భావన. అంతే కాదు
వసంత ఋతువు కూడా అప్పుడే
మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి
గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
శాలివాహనుడు
పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ
పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ."ఉగాది",
మరియు "యుగాది" అనే రెండు పదాలు
వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం.
నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే
సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక
జంట అని కూడా అర్ధము.
ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం
'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి
ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు
పేర్కొనియున్నాడు.
సంప్రదాయాలు: ప్రతి సంవత్సరం చైత్రమాసంలో
శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను
జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో
దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం,
నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం),
ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం. మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని
వ్రతగంధ నిర్దేశితం. ఉగాది రోజు నుండే
తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి
పండుగ, ముఖ్యమయిన పండుగ. ఉగాది రోజున కొత్తగా
పనులు ప్రారంభించుట పరిపాటి. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం
పూర్వం నుంచీ వస్తున్న ఆచారం.
పంచాంగ శ్రవణం: ఆదాయ వ్యయాలు, రాజ
పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి
ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో
రైతులు ఉగాది రోజున అక్కడి
దేవాలయం వద్ద అంతా చేరి,
పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ
కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు
ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. పంచాంగ
శ్రవణం వళ్ళ రానున్న మంచి
చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని
మన పెద్దలు చెప్పటం జరిగింది. మనకు తెలుగు సంవత్సరాలు
‘ప్రభవ’ తో మొదలుపెట్టి ‘అక్షయ’
నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో
మానవులు తాము జన్మించిన నామ
సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి
జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు
తిరిగి ఆ నామ సంవత్సరం
వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా
భావించి ‘షష్టిపూర్తి’ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ఈ పండగ ఒక్క
తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి
పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు
అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను,
సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా
బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
కవి సమ్మేళనం:
ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం" నిర్వహిస్తారు.
కొత్త, పాత కవులు నవభావన,
పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు,
కవితలు తయారు చేసి చదువుతారు.
సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి
ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ
విధంగా నానా రుచి సమ్మేళనంగా
జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.
ఊరగాయల కాలం:
మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి,
ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ". “ఇలా వివిధ విశేషాలకు
నాంది యుగాది - తెలుగువారి ఉగాది”
షడ్రుచుల సమ్మేళనం ‘ఉగాది పచ్చడి’:- ప్రాముఖ్యత
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల
సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి
జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు
ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే
అర్ధవంతం అని చెప్పే భావం
ఇమిడి ఉంది . "ఉగాది పచ్చడి" ఈ
పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం.
ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం,
ఉప్పు, వగరు, చేదు అనే
ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి
తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట
సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.
ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి
పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు,
జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో
"నింబ కుసుమ భక్షణం" మరియు
"అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.
ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ,
పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే
ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా
తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు
వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ
నవమి వరకు తినాలని శాస్త్రాలు
చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం
ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా:-
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు - చేదు
-బాధకలిగించే అనుభవాలు చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు
- పులుపు - కొత్త సవాళ్లు మిరపపొడి
- కారం - సహనం కోల్పోయేట్టు చేసే
పరిస్థితులు ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి
తయారు చేసి దేవునికి నైవేద్యంగా
పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు
కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని
తర్వాత అల్పాహారం తీసుకుంటారు. "త్వామష్ఠ శోక నరాభీష్టమధుమాస సముద్భవనిబామి
శోక సంతప్తాంమమ శోకం సదా కురు"
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని
శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే
ఆచారం ఆహారం లో ఉండే
ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే
కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
ఆ రకంగా తమ జీవితాలు
అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment