Monday, 16 February 2015

'శివపురాణం'లోని లింగోద్భవ కథ

'శివపురాణం'లోని లింగోద్భవ కథ
పరమేశ్వరుడు మంగళ స్వరూపుడు, ఆయన ఆదిదేవుడు, ఆది మధ్యాంత రహితుడు.
అడిగినవారికి, అడిగినంత ఇచ్చే బోళాశంకరుడు. తాను గరళాన్ని మింగి, లోకాలకు అమృతాన్నిచ్చిన మహోదారుడు శంకరుడు. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ, భక్తులకు సకలైశ్వరముల నిచ్చే భక్తజన సులభుడు పరమశివుడు.అసలు 'శివం' అంటేనే 'మంగళం' లేక ''కల్యాణం అని అర్థం. పరమేశ్వరుడు మంగళస్వరూపుడు.
శివ - అంటే పరమేశ్వరుడు.
శివా - అంటే పార్వతి. ఇలా అయ్యవారిలోనే అమ్మవారు ఉంది.
'శివపురాణం'లోని లింగోద్భవ కథ అందరికీ తెలిసిందే. శివుడు ప్రథమంగా లింగరూపిగా వెలసిన సందర్భం - హరిబ్రహ్మల వివాద సందర్భంలో రోజు ఒకానొక మాఘమాసంలో కృష్ణ చతుర్దశి రోజు. అర్థరాత్రి వేళ!

బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమ తమ గొప్పదనాలను గురించి వాదులాడుకుంటున్న సమయం. సృష్టిస్థితి, కారకులైన వాపరిద్దరూ అలా వాదులాడుకోవడం, వారిపై ఆవరించియున్న 'మాయ'కు సంకేతం. మాయను తొలగించేందుకు 'మాయి' అయిన మహేశ్వరుడు పూనుకోక తప్పలేదు. పరస్పర ఆధిక్యతను నిరూపించుకునేందుకు బ్రహ్మాస్త్ర వైష్ణవాస్త్రాలు విజృంభించినప్పుడు, ఇద్దరి నడుమన ఆదిశంకరుడు అఖండాగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు.

మాఘకృష్ణ చతుర్దశ్యామాది దేవో మహానిశి
శివలింగ తయోద్భూత: కోటి సూర్య సమప్రభ.

కోటి సూర్యలకు సమానమైన ప్రకాశంగల మహాలింగం ఆవిర్భావం జరిగిన రోజే మహాశివరాత్రి. మహాగ్ని స్తంభానికి ఆది, అంతం లేదు. లింగ స్వరూపం నిర్గుణ పరతత్త్వ స్వరూపం.

ఆయన శుభాలనొసగేవాడు. లోక కల్యాణమూర్తి. తనను ప్రార్థించినవారికి కొంగు బంగారం. తనను ఎలా పూజించినా సరే, కేవలం 'భక్తి'కి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే అభయంకరుడు శంకరుడు. మహేశ్వరుని విభూది ధరించని నుదురు, ఈశ్వరార్చన చేయని జన్మం, శివాలయ లేని గ్రామం, శివ సంబంధం లేని విద్య, అత్యంత నీచములు, నింద్యములని జాబాలోపనిషత్తు చెబుతోంది. అందుకే సాధారణంగా మన దేసంలో శివాలయం లేని ఊరుండదు. శివాలయం లేని ఊరు స్మశానంతో సమానం.
  వల్లూరి పవన్ కుమార్ 
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ





Friday, 13 February 2015

స్వామి దయానంద సరస్వతి జయంతి

స్వామి దయానంద సరస్వతి జయంతి
స్వామి దయానంద సరస్వతి (1824-1883) ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం లో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.
జీవిత చరిత్ర
మూల శంకర్ 1824 లో గుజరాత్ లోని ఠంకార అనే గ్రామంలో ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక మహా శివ భక్తుడు, పద్నాలుగేళ్ల ప్రాయంలో ఒక శివరాత్రి నాడు శివలింగంపై విసర్జిస్తున్న మూషికాలను చూసి, ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించి 1846 లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానంద అన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథుర లోని స్వామి విరజానంద సరస్వతి కడకు చేరుకున్నాడు, అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలుదేరెను.
ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నాడు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది, ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు, అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ఖండములగుచున్నది, అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసిచలించి పోయి వాటిని ఛేదించడానికి 'పాఖండ ఖండిని ' అన్న పతాకాన్ని ఆవిష్కరించినాడు.
భారత దేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి (స్వరాజ్) స్వయం పరిపాలన అని మొదటి సారి గొంతెత్తినాడు. దయానందుడు వ్రాసిన సత్యార్థ ప్రకాశ్ లో భారత దేశం నుండి సమస్త భారతీయుల మనసులలోని మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాల నిర్మూలన గూర్చి వ్యాఖ్యానించాడు.
ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ 1875 ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించినాడు. క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయినాడు, పూర్వం ఏడు సార్లు విషప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని వాటిని విఫలము చేసినను, చివరిసారిగా 30 అక్టోబర్ 1883 దీపావళి సాయంత్రము జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందాడు. ఆయన తన వాదనలను, ఉద్యమాన్ని సమర్థిస్తూ అథర్వణ, యజుర్వేదం వంటివి భాష్యం చేసిన వేదభాష్యకారుడు.
   వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ