రథ సప్తమి
మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో
సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రధసప్తమి
అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన
ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి
కృతజ్ఞతలు తెలిపే పండుగే రధసప్తమి. షష్ఠితో కూడిన సప్తమి (తిధిద్వయం)
కలిసి రావడం వల్ల రధసప్తమి
అత్యంత శ్రేష్టమైనది. ఆ రోజు చేసే
స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు,
తర్పణాదులు అధికఫలాన్నిస్తాయి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన
వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ అని (నమస్తే ఆదిత్యత్వమేవ-చందోసి) సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది.
వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య
హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా.
ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు. కోణార్క్, అరసవిల్లి ఆదిత్యాలయాలకు ప్రసిద్దం. అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు
భార్యలతో సూర్యుడు దర్శనమిస్తాడు.
రధసప్తమి నాడు సూర్య వ్రతాన్ని
ఆచరించేవారు నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం
పెట్టుకొని స్నానం చేయాలి.
స్నాన విధానం:
వ్రతచడామణిలో
"బంగారు, వెండి, రాగి, ఇనుము, వీనిలో
దేనితోనయినా చేసిన దీపప్రమిదను సిద్ధం
చేసుకొని, దానిలో (నెయ్యి, నువ్వులనూనె, ఆముదం, ఉప్పనూనె - వీనిలో ఏదో ఒకదానితో) దీపం
వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై
పెట్టుకొని, నదీతీరానికిగానీ, చెరువుల వద్దకుగానీ వెళ్లి, సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్లలో
వదలి, ఎవరునూ నీటిని తాకకముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడాకులుగానీ, ఏడు
రేగు ఆకులుగానీ తలపై పెట్టుకోవాలి.
సప్తమీవ్రతం:
రధసప్తమి ఒక్కటేకాక, కల్యాణ సప్తమి, కమలసప్తమి, శర్కరాసప్తమి, అచలాసప్తమి, రధాంకసప్తమి, మహసప్తమి, జయాసప్తమి, విజయాసప్తమి, నందాసప్తమి, సిద్ధార్ధికాది సప్తమి, సాక్షుభార్యా సప్తమి, సర్షపసప్తమి, మార్తాండసప్తమి, సూర్యవ్రతసప్తమి, సప్తసప్తి సప్తమి, అర్కసంపుటసప్తమి, నింబసప్తమి, మరీచసప్తమి, ఫలసప్తమి - మున్నగు అనేక సప్తమీ వ్రతాలను
గురించి గ్రంధాలు పేర్కొన్నాయి. ఇవ్వన్నీ సూర్యుణ్ణి గుర్తించిన వ్రతాలే! ఇందులో కొన్ని రధసప్తమినాడు ఆచరించేవి!
పంచాంగకర్తలు రధసప్తమిని ' సూర్యజయంతి ' అన్నారు. వైవస్వతమన్వాది ఈనాడే కావడం విశేషం.
ఈ రోజు అభోజ్యార్క వ్రతాదులు
ఆచరించాలి (భోజనం చేయకుండా చేసే
వ్రతం). వైవస్వతుడు ఏడవమనువు. సూర్యుడు వివస్వంతుడు. ఇతనికొడుకు కనుక వైవస్వతుడు (ఇప్పటి
మనువు వైవస్వతుడే). ఇతని మన్వంతరానికి రధసప్తమియే
సంవత్సరాది - అనగా ఉగాది. మన్వంత
రాదిపర్వదినం పితృదేవతలకు ప్రియమైనది. కనుకనే రధసప్తమినాడు - మకర సంక్రాంతివలనే - పితృతర్పణం
చేయాలి. పితృదేవతలకు సంతోషం కల్గించాలి. చాక్షుషమన్వంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయిన సత్యవంతుడే, ఈ
కల్పంలో వైవస్వతుడుగా పుట్టినాడు.
జిల్లేడు, రేగు ఆకుల ప్రాశస్త్యం:
రధసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగుఆకులను (రేగుపండ్లు కూడ) తలపై, భుజాలపై,
చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి. మన భారతీయ ఆచారాలు
మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక
ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిల్చి వున్నాయి. వాటిల్ని గురించి తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా సత్ఫలితం మాత్రం తప్పక వుంటుంది. కానీ
తెలిపి ఆచరించడం ద్వారా తాను లాభపడుటేగాక, ఇతరులతోనూ
చేయించి, వారిను సత్ఫలవంతుల్ని చెయవచ్చు.
రుద్రాక్ష చెట్టు:
ఈ చెట్టు ఎక్కువగా ఉత్తరహిందూస్ధాన్లో వున్నాయి. వీటి
గింజలే రుద్రాక్షలు. వీని భేధాలూ, ప్రభావాలూ
జగద్విదితం. వాతశ్లేష్మాన్ని హరిస్తాయి. రుద్రాక్షలు నానబెట్టి, ఆ నీళ్లు సేవిస్తే
మశూచిక రాదు. రుద్రాక్షలు శివసంబంధమైనవి.
జిల్లేడు(అర్క):
శ్లేష్మ, పైత్య, వాత దోషాలను హరిస్తుంది.
చర్మరోగాలను, వాతం నొప్పులను, కురుపులను,
పాము, తేలు విషాన్నీ, పక్షపాతాన్నీ,
బోదకాలు వ్యాధినీ, పోగొటుతుంది. ఇందులో తెల్లజిల్లేడు చాలా శ్రేష్టం. ఉపయోగించి
విధానం తెలిస్తే దీని ఆకులు, పాలు,
పూలు, కాయలు అనేక వ్యాధులపై
చక్కగా పనిచేసి, ఉపశమనం కల్గిస్తాయి.
రేగు చెట్టు:
(బదరీ)
దీని గింజలు మంచిబలాన్ని కల్గిస్తాయి. ఆకులు నూరి, తలకు
రుద్దుకొని, స్నానం చేస్తూంటే వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకుల్ని నలగకొట్టి,
కషాయం కాచి, అందులో సైంధవలవణం
కలిపి తీసుకొంటే బొంగురు గొంతు తగ్గి, స్వరం
బాగా వస్తుంది. దీని పండ్లు చలువ
చేస్తాయి. మంచిరక్తాన్ని కల్గిస్తాయి. మూలవ్యాధిని పోగొట్తాయి. పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. (జిల్లేడు, రేగు, విషయంలో కొన్ని
దోషాలూ ఉన్నాయి. కనుక వేద్యుని ద్వారా
తెలిసికొని ఉపయోగించాలి.)
జననీ త్వం హి లోకానాం
సప్తమీ సప్తసస్తికే,
సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే.
"సస్తాశ్వాలుండే
ఓ సప్తమీ! నీవు సకల లోకాలకూ
తల్లివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం"- అని
చెప్తూ, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుణ్ణి పూజించాలి. పిదప తర్పణం చేయాలి.
మాఘప్రశస్తి:
మా+అఘ=పాపంలేనిది - పుణ్యాన్ని
కల్గించేది. మనం చేసే పూజలూ,
వ్రతాలూ అన్నీ పుణ్యసంపాదన కొరకే!
శివకేశవులకు ఇరువురికీ మాఘం ప్రీతికరమైనదే! ఉత్తరాయణం
మకరసంక్రమణంతో ప్రారంభమైనా - రధసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్పూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండి
వేసవి ప్రారంభమైనట్లే!
రధసప్తమినాటి శిరస్నానం వేళ పఠించవలసిన మంత్ర
శ్లోకం:
య దాజన్మకృతం పాపం మయా జన్మసు
జన్మసు,
తన్మే రోగంచ శోకంచ మాకరీ
హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే
పునః
ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే
సప్తసప్తికే!
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.
జనమ జన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల
ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ
ఓ లక్ష్మీకరమైన రధసప్తమీ! నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక !
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్
శాఖ