పొట్టి శ్రీరాములు
జననం : మార్చి 16, 1901
అణ్ణాపిళ్ళె, జార్జిటౌను, మద్రాసు
మరణం : 1952 డిసెంబరు 15 మద్రాసు
పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను,
అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో
గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం.
ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు
విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత
బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు
నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు.
1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది.
తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా
చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు
జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా
చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
స్వాతంత్ర్యోద్యమంలో
పాత్ర
పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో
పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష
అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన
ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History
of Andhra Movement) అధ్యయనంలో
పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి
ఇలా వ్రాయబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ,
వినయం, సేవ, నిస్వార్ధత లు
మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోను,
ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో
పాల్గొన్నాడు. కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు.
1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు.
కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం
చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని
వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి
నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం
చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో
కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం
కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.
ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష
మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర
రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో
1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి
ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన
దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర
కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను
సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన
చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి
అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో
ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు.
తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు
ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు
కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం
ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ
ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే
ఒక్క రోజు కూడా ఆంధ్రులు
మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన
వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ
కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి
కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు,చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా
వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా
వాళ్ళను మేము నమ్మం,రాజధాని
రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని
నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 నవంబరు 1న ఆంధ్ర రాష్ట్రం
ఏర్పరచారు. బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు
కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.
మరణం
డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు!! ఉదయం నుంచే ఆయన
స్పృహలో లేరు. కళ్లు తెరిచారు.
అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు
కదిపేందుకు కూడా శక్తి లేదు.
54 పౌనుల (24.5 కేజీలు) బరువు తగ్గారు. నాడి
కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా...
చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం
చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను
బలిదానం చేసుకొన్నాడు.
వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్
శాఖ
No comments:
Post a Comment