వైకుంఠ చతుర్దశి విశిష్టత
కార్తీక శుద్ధ చతుర్దశిని 'వైకుంఠ
చతుర్దశి'గా పిలుస్తుంటారు. సాక్షాత్తు
శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని
పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ
రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది.
ఈ విషయంలో ఒకానొక కాలంలో వాదోపవాదాలు జరిగినప్పటికీ, ఆ తరువాత కాలంలో
శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని
చాలామంది గ్రహించారు. ఇక ఈ కార్తీకమాసాన్ని
మించిన పవిత్రమైన మాసం మరొకటి లేదని
సాక్షాత్తు శివకేశవులే సెలవిచ్చారు. ఈ మాసమంతా కూడా
ప్రతిరోజూ ఓ ప్రత్యేకతను ... విశిష్టతను
సంతరించుకుని కనిపిస్తుంది.
హరిహరులకు ఇది ఎంతో ప్రీతికరమైన
మాసం కనుక ఈ సమయంలో
వారి అనుగ్రహాన్ని సంపాదించడం ఎంతో తేలిక. ఈ
కారణంగానే ఈ మాసంలో శ్రీమహావిష్ణువును
తులసి దళాలతోను ... శివుడిని బిల్వదళాలతోను పూజిస్తుంటారు. ఇక లక్ష్మీపార్వతులు కూడా
నోములు ... వ్రతాలను ఆచరించే ముత్తయిదువులను అనుగ్రహిస్తూ తీరికలేకుండా వుంటారు. అంటే ఇటు లక్ష్మీనారాయణుల
ఆశీస్సులు ... అటు శివపార్వతుల అనుగ్రహాన్ని
అందించే అద్వితీయమైన మాసంగా ఇది చెప్పబడుతోంది.
ఈ నేపథ్యంలో భక్తుల ముందుకు ఒక వరంగా వచ్చే
విశిష్టమైన రోజే 'వైకుంఠ చతుర్దశి'.
సమస్త మానవాళిచే పూజలు అందుకుంటూ వుండే
విష్ణుమూర్తి, ఈ రోజున శివుడిని
పూజిస్తాడంటే ఇది ఎంతటి పవిత్రమైనరోజో
అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీమహావిష్ణువు
వైకుంఠం నుంచి నేరుగా కాశీ
నగరానికి వెళ్లి అక్కడి విశ్వనాథుడిని అర్చిస్తాడని అంటారు. ఇక ఈ రోజున
లింగావ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి
మోక్షం లభిస్తుంది.
శివకేశవులను ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందే ఈ రోజున
ఇత్తడి కుందుల్లో గానీ, రాగి కుందుల్లో
గాని దీపాలను వెలిగించి వాటిని దానాలు చేయాలి. ఈ విధంగా చేయడం
వలన సమస్త దోషాలు సకల
పాపాలు తొలగిపోతాయి ... ఆశించే శుభాలు ఆనందంగా చేకూరతాయి.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment