శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి
ఓం శ్రీ వల్లీసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామినే
నమః
సుబ్రహ్మణ్య షష్ఠి దీపావళి పండుగ
తర్వాత జరిగే ఉత్సవం. దీనినే
సుబ్బరాయషష్టి అని, స్కందషష్టి అని
కూడా అంటారు. సుబ్రమణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము.
దక్షిణాదిన, ముఖ్యంగా, శివారాధన ప్రాబల్యంగా ఉన్న తమిళ నాట
సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రధాన ఆరాధ్య
దైవం. ఆరు పడి అని
ఆరు పుణ్య క్షేత్రాలైన పళని,
స్వామి మలై, తిరుచ్చెందూర్, త్రిపురకుంద్రం,
పళముదిర్ చోలై, తిరుత్తణి క్షేత్రాలు
మహా సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. పిల్లలు పుట్టని వారికి, నాగ దోషమున్న వారికి,
కుజ దోషమున్న వారికి ఈ క్షేత్రాలు గొప్ప
ఫలితాలు ఇస్తాయని గట్టి నమ్మకం. అలాగే,
కర్ణాటకలోని కుక్కే లో సుబ్రహ్మణ్యస్వామి క్షేత్ర
కూడా అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఈ క్షేత్రాలలో ఈ
స్వామి సౌందర్యము, భోగము చెప్పనలవి కాదు.
పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను
రాక్షసుని బారి నుండి రక్షణ
పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు.
ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి,
వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని
వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో
ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు
గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం
జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని
సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.
అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు
చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి,
శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో
ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి
గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం
అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.
ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు
పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి
ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ
శివుడు తన దివ్య తేజస్సును
ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును
గంగానదిలో విడచి పెడతాడు. ఆ
తేజము ఆ సమయమందు ఆ
నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల
గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు
భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు
కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా
ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ
పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున
చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని
పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు
ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే
కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.
కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి
పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా
చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు
"శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి
కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి
సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.
అంత ఆ స్వామి నెమలి
వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను
మరో ఆరు చేతులతో బాణాలు
ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని
తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము
చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు
దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ
సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని, సర్వులకు
పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని
విశిష్టతను వివరిస్తారు.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ