కార్తీకపురాణం 15వ అధ్యాయం : దీప
ప్రజ్వలనం - ఎలుకకు పూర్వజన్మ స్మృతి
తిరిగి జనక మహారాజుతో వశిష్టమహాముని
ఇలా అంటున్నారు… ”ఓ జనకా! కార్తీక
మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తికాదు.
కానీ, ఇంకో ఇతిహాసం చెబుతాను.
శ్రద్ధగా విను…” అని ఇలా చెప్పసాగెను.
”ఈ నెలలో హరినామ సంకీర్తనలు
చేయడం, వినడం, శివకేశవుల వద్ద దీపారాధన చేయడం,
పురాణ పఠనం లేదా శ్రవణం,
సాయం సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా
చేయాలి. అలా చేయనివారు కాలసూత్రమనే
నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశిరోజున మనసారా
శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది.
శ్రీమన్నారాయణును గంధపుష్పాలతో, అక్షితలతో పూజించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే… విశేష ఫలం లభిస్తుంది.
ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా చేసిన
వారు అంత్యమున దేవదుందుభులు మోగుతుండగా… వైకుంఠంలో విష్ణుసాన్నిధ్యం పొందగలరు. ఇలా నెలరోజులు పూజాదికాలు
నిర్వర్తించలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్ధశి,
పౌర్ణిమ రోజుల్లో నిష్టతో పూజ చేసి, ఆవునేతితో
దీపం వెలిగించాలి. ఆవుపాలు పితికినంత సేపైనా దీపం వెలిగించిన వారికి
తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు
పెట్టిన దీపంలో నూనె వేసినా… అవసానదశలో
ఉన్న దీపం వత్తిని పైకి
జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా… వారి సమస్తపాపాలు హరిస్తాయి.
దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను
విను…” అని ఇలా చెప్పసాగెను…
సరస్వతి నదీ తీరంలో శిథిలమైన
దేవాలయమొకటి ఉండేది. కర్మనిష్టుడైన దయార్థ్ర హృదయుడైన ఒక యోగిపుంగవుడు ఆ
దేవాలయం వద్దకు వచ్చి, కార్తీకమాసమంతా అక్కడే గడిపి, పురాణ పఠనం చేయాలని
తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని
శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడిగి, బొట్టు పెట్టి, పక్కగ్రామాలకు వెళ్లి, ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు చేసి, పన్నెండు దీపాలు
పెట్టాడు. స్వామిని పూజిస్తూ… నిష్టతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం
ఆరంభం నుంచి చేయసాగాడు. ఒక
రోజున ఓ ఎలుక ఆ
దేవాలయంలోకి ప్రవేశించింది. నాలుగు మూలలు వెతికి, తినడానికి
ఏమి దొరుకుతుందా? అని అక్కడ ఆరిపోయిన
వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ వత్తిని
నోట కరుచుకుని తీసుకెళ్తుండగా… పక్కనే ఉన్న దీపానికి తగిలి,
ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు
నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి
వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం,
శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల
దాని పాపాలు హరించుకుపోయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది.
ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు
కళ్లు తెరిచిచూడగా… పక్కనే ఒక మానవుడు నిలబడి
ఉండడం గమనించాడు. ”ఓయీ…! నీవు ఎవరవు?
ఎందుకు ఇలా నిలబడ్డావు?” అని
ప్రశ్నించగా… అతను వినమ్రంగా… ”అయ్యా!
నేను ఒక ఎలుకను. రాత్రి
నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను.
ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యివాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని
తినాలని దాన్ని నోటకరిచితీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది.
ఆ వత్తి వెలగడం వల్ల
నా పాపాలు హరించుకుపోయాయనకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ… ఓ మహానుభావా!
నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో, దానికి
కారణమేమో తెలియదు. మీరు యోగిపుంగవుల్లా ఉన్నారు.
దయచేసి, నాకు విశదీకరించండి” అని
కోరాడు.
అంతట ఆ యోగి ఆశ్చర్యంతో
తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా
చెబుతున్నాడు… ”ఓయీ! నీవు కిందటి
జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు.
నీవు జైనమతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి
వ్యవసాయం చేస్తూ… ధనాశాపరుడవై వైదేవ పూజలు, నిత్యకర్మలను
మరచావు. నీచుల సహవాసం చేశావు.
నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు, యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ
చింతన కలిగిఉండడమే కాకుండా, ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి,
దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా
కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా
అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక… ఇతరులకు
ఇవ్వక భూస్థాపితం చేసి, పిసినారివై జీవించావు.
మరణించిన తర్వాత ఎలుక జన్మనెత్తి, వెనకటి
జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని
వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లేనీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి, నీవు నీగ్రామానికి వెళ్లి,
నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి,
దాంతో దానధర్మాలు చేసి, భగవంతుడిని ప్రార్థిస్తూ
మోక్షం పొందుము” అని నీతులు చెప్పి
పంపాడు.
”చూశావా జనకమహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి
వెలిగించినంతమాత్రాన ఒక మూషికం ఎంతటి
ఫలితాన్ని పొందిందో?? ఇలా కార్తీకమాసంలో దీపం
వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కేందుకు
సిద్ధంగా ఉన్న దీపంలో నూనెవేసి
వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ…”
అని వివరించాడు.
స్కాందపురాణాంతర్గత
వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య పంచ దశాధ్యాయ్ణ
సమాప్త్ణ 15వ
రోజు పారాయణం సమాప్తం
మ|| సదయా ఇంద్రియ ధేనువుల్
విషయ ఘాస గ్రాసలో లమ్ము
లై
బ్రదు కుం బిడులు బట్టి
నిన్మరిచి పోవంబోవ ప్రాయం పుప్రో
ద్ద దేడిందన్ పయిగమ్ము చికటిలలో నల్లాడవే సుంత నీ
మృదవౌ మోవిని పిల్ల గ్రోవి నీడలేని
వేణు గోపాలకా||
కార్తీక పురాణం 15వ అధ్యాయం: దీప
ప్రజ్వలనం-ఎలుకకు పూర్వజన్మ స్మృతి
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment