కార్తీకపురాణం 12వ అధ్యాయం :
ద్వాదశి ప్రశంస, సాలగ్రామదాన మహిమ.
వశిష్టుడు తిరిగి ఇలా చెబుతున్నాడు… ”ఓ
జనక మహారాజా! కార్తీక మాసంలో కార్తీక సోమవారం, కార్తీక ద్వాదశి, సాలగ్రామ మహిమలను గురించి వివరిస్తాను విను…” అని ఈ విధంగా
చెప్పసాగాడు.
”కార్తిక సోమవారం రోజు పొద్దున్నే నిద్రలేచి,
రోజువారీ విధులు నిర్వర్తించుకుని, నదికి వెళ్లి, స్నానం
చేయాలి. ఆ తర్వాత శక్తికొద్దీ
బ్రాహ్మణులకు దానమిచ్చి, ఆరోజంతా ఉపవాసముండాలి. సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణువాలయానికి గానీ
వెళ్లి, పూజించాలి. నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం భుజించాలి. ఈ విధంగా చేసేవారికి
సకల సంపదలు కలగడమే కాకుండా, మోక్షం లభిస్తుంది.
కార్తిక మాసంలో శనిత్రయోదశి గనక వస్తే… ఆ
వ్రతం ఆచరిస్తే నూరు రెట్ల ఫలితం
కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశిరోజున పూర్తిగా
ఉపవాసం ఉండి, ఆ రాత్రి
విష్ణువాలయానికి వెళ్లి, శ్రీహరిని మనసారా ధ్యానించి, ఆయన సన్నిధిలో పురాణ
కాలక్షేపం చేసి, మర్నాడు బ్రాహ్మణ
సమారాధన చేసినట్లయితే.. కోటి యజ్ఞాల ఫలితం
కలుగుతుంది. ఈ విధంగా చేసినవారు
సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానం చేసినట్లయితే… కోటి మంది బ్రాహ్మణులకు
అన్నదానం చేసినదానికంటే అధిక ఫలితం కలుగుతుంది.
కార్తీక శుద్ధ ద్వాదశినాడు శ్రీమన్నారాయణుడు
శేషపానుపు నుంచి లేస్తాడు కాబట్టి,
ఆ రోజు విష్ణువుకు అమిత
ఇష్టమైన రోజు. ఆ రోజున
శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు
తొడుగులు తగిలించి, ఆవు కాళ్లకు వెండి
డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునకు
దానమిచ్చినట్లయితే… ఆ ఆవు శరీరంలో
ఎన్ని రోమాలున్నాయ… అన్నేళ్లు వారు ఇంద్రలోక ప్రాప్తి
పొందగలరు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున,
కార్తీక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవునేతిని పోసి, దీపముంచిన వారు
పూర్వజన్మలో చేసిన సకల పాపాలను
పోగొట్టుకుంటారు. ద్వాదశిరోజు యజ్ఞోపవీతాలను దక్షిణతో బ్రాహ్మణుడికి దానమిచ్చినవారు ఇహపర లోకాల్లో సుఖాలను
పొందగలరు. ద్వాదశిరోజున బంగారు తులసి చెట్టును, సాలగ్రామాన్ని
బ్రాహ్మణుడికి దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని
దానం చేసినంత ఫలితం కలుగుతుంది. ఇందుకు
ఉదాహరణగా ఒక కథ ఉంది.
చెబుతాను… శ్రద్ధగా ఆలకించు….” అని ఇలా చెప్పసాగాడు.
సాలగ్రామ దాన మహిమ
పూర్వము అఖండ గోదావరి నదీ
తీరంలోని ఒక గ్రామంలో ఒక
వైశ్యుడు నివసించేవాడు. వాడు దురాశపరుడై, నిత్యం
డబ్బుగురించి ఆలోచించేవాడు. తాను అనుభవించకుండా, ఇతరులకు
పెట్టకుండా, బీదలకు అన్నదానం, ధర్మాలు చేయకుండా, ఎప్పుడూ పర నిందలతో కాలం
గడిపేవాడు. తానే గొప్ప శ్రీమంతుడినని
విర్రవీగుచుండేవాడు. పరుల ధనం ఎలా
అపహరించాలా? అనే ఆలోచనలతోనే కాలం
గడిపేవాడు.
అతడొకరోజు తన గ్రామానికి దగ్గర్లో
ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడికి తన
వద్ద ఉన్న ధనాన్ని పెద్ద
వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరి
కొంత కాలానికి తన సొమ్ము అడగగా…
ఆ బ్రాహ్మణుడు ”అయ్యా! మీకు రావాల్సిన మొత్తాన్ని
నెలరోజుల్లో ఇస్తాను. మీ రుణం తీర్చుకుంటాను.
ఈ జన్మలో కాకున్నా… వచ్చే జన్మలో ఒక
జంతువుగా పుట్టి అయినా… మీ రుణం తీర్చుకుంటాను”
అని వేడుకొన్నాడు. దానికి ఆ వైశ్యుడు ”అలా
వీల్లేదు. ఇప్పుడు నా సొమ్ము నాకిచ్చేయి.
లేకపోతే నీ తలను నరికి
ఇవ్వు” అని ఆవేశం కొద్దీ
వెనకా ముందూ వెనకా ఆలోచించకుండా
కత్తితో ఆ బ్రాహ్మణుడి కుత్తుకను
కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా
తన్నుకుని చనిపోయాడు. దాంతో ఆ వైశ్యుడు
భయపడి, అక్కడే ఉన్న రాజభటులు పట్టుకుంటారని
భయపడి తన గ్రామానికి పారిపోయాడు.
బ్రాహ్మణ హత్య మహాపాతకం కాబట్టి,
అప్పటి నుంచి ఆ వైశ్యుడికి
బ్రహ్మహత్యాపాపం ఆవహించింది. కుష్టువ్యాధి కలిగి నానా బాధలు
పడుతూ కొన్నాళ్లకు చనిపోయాడు. వెంటనే యమదూతలు అతన్ని తీసుకుపోయి, రౌరవాది నరక కూపాల్లో పారేశారు.
ఆ వైశ్యుడికి ఒక కొడుకున్నాడు. అతని
పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగ్గట్లుగానే
తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలకు వెచ్చించేవాడు.
పుణ్యకార్యాలు ఆచరించేవాడు. నీడ కోసం చెట్లు
నాటించడం, బావులు, చెరువులు తవ్వించడం చేశాడు. సకల జనులను సంతోషపెడుతూ
మంచి కీర్తిని సంపాదించాడు. ఇలా ఉండగా… కొంతకాలానికి
త్రిలోక సంచారి అయిన నారదుడు యమలోకాన్ని
దర్శించి, భూలోకంలో ధర్మవీరుడి ఇంటికి వెళ్లాడు. ధర్మవీరుడు నారదమహర్షిని సాదరంగా ఆహ్వానించి, అర్ఘ్య పాద్యాదులు అర్పించాడు. చేతులు జోడించి ”ఓ మహానుభావా…! నా
పుణ్యం కొద్ది నాకు మీ దర్శనం
లభించింది. నేను ధన్యుడను. నా
జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది.
శక్తి కొలది నేను ఇచ్చే
ఆతిథ్యాన్ని స్వీకరించండి” అని వేడుకొన్నాడు. అంతట
నారదుడు చిరునవ్వు నవ్వుతూ… ”ఓ ధర్మవీరా! నేను
నీకొక హితోపదేశం చేయాలని వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీకమాసంలో
శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆరోజున స్నాన,
దాన, జపాదులు ఏవి చేసినా… అత్యంత
ఫలం కలుగుతాయి. నాలుగు జాతులలో ఏ జాతివారైనా… స్త్రీ
పురుషులనే బేదం లేకుండా… దొంగ
అయినా, దొర అయినా, పతివ్రత
అయినా, వ్యభిచారిణి అయినా… కార్తీక శుద్ధ ద్వాదశి రోజున
సూర్యుడు తులా రాశిలో ఉండగా…
నిష్టతో ఉపవాసముండాలి. సాలగ్రామదానం చేయాలి. అలా చేసినవారు తండ్రి
రుణం తీర్చుకుంటారు. ఈ వ్రతం వల్ల
కిందటి జన్మ, ఈ జన్మలో
చేసిన పాపాలు తొలగిపోతాయి. నీ తండ్రి యమలోకంలో
మహానరక బాధలు అనుభవిస్తున్నాడు. అతన్ని
ఉద్దరించేందుకు నీవు సాలగ్రామదానం చేయక
తప్పదు.” అని చెప్పాడు. అంతట
ధర్మవీరుడు నారదమహామునితో… ”మునివర్యా! నేను గోదానం, భూదానం,
హిరణ్యదానం మొదలగు మహాదానాలన్నీ చేశాను. అలాంటి దానాలు చేసినా నా తండ్రి మోక్షాన్ని
పొందకుండా నరకానికి వెళ్లినప్పుడు… ఈ సాలగ్రామ దానం
చేస్తే ఆయన ఎలా ఉద్దరింపబడతాడు?”
అని చెప్పాడు. అతని అవివేకానికి విచారించిన
నారదుడు ఇలా చెబుతున్నాడు ”ఓ
వైశ్యుడా! సాలగ్రామం శిలామాత్రమే అనుకుంటున్నావా? అది శిలకాదు. శ్రీహరి
రూపం. అన్ని దానాల్లో సాలగ్రామదానం
వల్ల కలిగే ఫలం గొప్పది.
నీ తండ్రి నరక బాధ నుంచి
విముక్తి పొందాలంటే ఈ దానం తప్పదు.
మరో మార్గం లేదు” అని చెప్పి
అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ధర్మవీరుడు ధనబలంతో సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి
అతను చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టడం వల్ల అతను ఏడు
జన్మలు పులిగా, మూడు జన్మలు కోతిగా,
అయిదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు స్త్రీగా
పుట్టాడు. ఆ తర్వాత పది
జన్మలు పందిగా జన్మించాడు. ఆ తర్వాత ఓ
పేదబ్రాహ్మణుడి ఇంట్లో స్త్రీగా పుట్టాడు. ఆమె యవ్వనవతి అవ్వగానే…
ఓ విధ్వంసుడికి ఇచ్చి పెండ్లి చేశారు.
పెళ్లయిన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు.
చిన్నతనంలోనే ఆమెకు అష్టకష్టాలు సంభవించాయి.
తల్లిదండ్రులు, బంధువులు ఆమెను చూసి దు:ఖించసాగారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు
ఎందుకు కలిగిందో తెలుసుకునేందుకు తన దివ్యదృష్టిని ఉపయోగించాడు.
ఆ తర్వాత ఆమెతో సాలగ్రామ దానం
చేయించాడు. ”నాకు బాలవైదవ్యం కారణమైన
పూర్వజన్మ పాపాం నశించుగాక” అని
సాలగ్రామ దానఫలాన్ని ధారబోయించాడు. ఆ రోజు కార్తీక
సోమవారం కావడం వల్ల దాని
ఫలంతో ఆమె భర్త పునర్జీవించాడు.
పిదప ఆ నూతన దంపతులు
చిరకాలం అన్యోన్యంగా మెలిగారు. ఆ తర్వాతి జన్మలో
ఆమె మరో బ్రాహ్మడి ఇంట్లో
కుమారుడిగా జన్మించాడు. నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తిని
పొందాడు.
”కాబట్టి ఓ జనక మహారాజా!
శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం
చేసినట్లయితే… ఆ ఫలితం ఇంత
అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆ
సాలగ్రామ దానాన్ని నిత్యం ఆచరిస్తూ ఉండు” అని సెలవిచ్చాడు.
ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత
వశిష్ట ప్రోక్తేన కార్తీక మహత్య ద్వాదశాధ్యాయ: సమాప్త:
పన్నెండో రోజు పారాయణం సమాప్తం
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment