Tuesday, 29 July 2014

శ్రీ ఆండాళ్ తిరునక్షత్రం

శ్రీ ఆండాళ్ తిరునక్షత్రం
రోజు ఆండాళ్ తల్లి పుట్టిన రోజు. కలియుగం ప్రారంభం అయిన 93 సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన తరువాత నర నామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ఆరంభం అయ్యిన తరువాత ఆండాళ్ తల్లి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించినది. విష్ణుచిత్తులు చాలా భక్తి కల మహనీయుడు, అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించేది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కల వాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే, అందులో మునిగి, అడుగుదాకా వెల్లి తిరిగి బయటికి వచ్చి, ఇంత ఉంది సుమా! అని బయటి లోకానికి తెలియజేసిన వాల్లను ఆళ్వారులు అని అంటాం. ఆళ్వారులు ద్వాపరంలో ఒక నలుగురు, కలియుగంలో మొదటి శతాబ్దానికి చెందినవారు ఒక ఆరుగురు. నమ్మాళ్వార్ తోపాటు ఆయన శిష్యుడైన మధుర కవి, ఇక విష్ణుచిత్తులవారి కుమార్తెగా ఆండాళ్ తో కలిసి మొత్తం పన్నెండు మంది ఆళ్వారులు. భగవంతుడు అంటే ఏమిటి, ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీల్లంతా.
కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః
విష్ణుచిత్తులవారు పాండ్య దేశపు సభకు వెల్లి, భగవంతుని అనుగ్రహంచే, తత్వం అంటే ఇట్లా ఉంటుంది అని నిర్ణయంచేసిన మహనీయుడు. పాండ్య రాజు ఆయనని ఏనుగు అంబారి పై ఉరేగించి బట్టర్పిరాన్ అని బిరుదిచ్చారు. అప్పుడు రాజుద్వారా ఆందిన సంపదతో శ్రీవెల్లిపుత్తుర్ ఆలయ గోపురం, ప్రాకారాదులకు కైకర్యంగా వినియోగించారు. తులసివనం పెంచి, తులసి మాలలను కట్టి స్వామికి అర్పించేవాడు ప్రతి దినం. ఒకనాడు ఆయనకు ఒక పాప తులసి వనంలో లభించింది. ఆయనకు సంతానం లేకపోవడంచే ఆమెపై మమకారంతో కృష్ణుడిగా భావించి పెంచాడు. శ్రీకృష్ణుడు యశోదమ్మకి కనకుండానే లభించాడో, ఈయన తను యశోదగా భావించి పిల్లని శ్రీకృష్ణ అంశగా భావించి పెంచుకున్నాడు. తులసి మాలని తమిళంలో కోదై అంటారు, ఆమెకు కోదా అని పేరు పెట్టుకున్నాడు. సంస్కృతంలో అది క్రమేపి గోదాగా మారింది. భగవంతుని కథలు గోదాదేవికి చెప్పుతూ పెంచారు ఆమె తండ్రి,అలా శ్రీకృష్ణ భక్తితో పెరిగింది. ఆమెను కృష్ణుడిగా భావిస్తూ తనను యశోదగా భావిస్తు విష్ణుచిత్తులవారు ఎన్నో పాటలు పాడేవారు. శ్రీకృష్ణుడి జ్ఞానం కల్గిఉండటంచే ఆయనను ఎలాపొందాలని కోరిక కల్గితే, వాల్ల తండ్రి వివిద దివ్యదేశాల గురించి తెలిపాడు. శ్రీరంగనాథున్ని ప్రేమించింది గోదాదేవి. ఒకప్పుడు విభవంలో మన వద్దకు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పడిలా ఇప్పుడు అర్చామూర్తిగా ఉన్నాడని తెలుసుకొని అట్లాంటి అనుభూతిని పొందింది గోదా. తన చుట్టు ఉన్న ఊరినే నందగోకులంలా, తన చుట్టూ వారినే గోపికలవలె, వూరి వటపత్రశాయి మందిరాన్నే నందగోప భవనంగా భావించిందిఆనాడు గోపికలు చేసిన వ్రతాన్ని తాను చేసింది. అలా భావిస్తూ రోజుకో పాటని పాడేది. మరి మాములు పాటలు కావు, సర్వ వేద సారం అని పిలవబడే తిరుప్పావై అనే ముప్పై పాటల్ని పాడింది గోదా. ఇంకా భగవంతుని దర్శనం కల్గలేదు, అప్పుడు తన వేదనని తెలియజేస్తూ నాచియార్ తిరుమొఱ్ఱి అనే మరొక నూట నలభై మూడు పాటల దివ్య ప్రబంధాన్ని పాడింది.అప్పుడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడు చలించి, తన వద్ద ఉన్న అర్చకుడిని ఆదేశించి గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూర్ నుండి పిలిపించుకుని, శ్రీరంగ క్షేత్రంలో రంగవిళాస మండపంలో మానవ కన్యగా ఉన్న ఆమెను వివాహమాడాడు. అమె స్వామి సన్నిదానంలో చేరిపోయిందితండ్రిగారు అయ్యో నా గోదా ఏది అని విలపిస్తుంటే, భగవత్ తత్వం తెలిసినవాడైనందుకు రంగనాథుడు విగ్రహరూపంలోనే ఆయనతో విలపించవలదు మీరు మీ వూరికి వెల్లండి, నేను గోదా దేవితో పాటు అక్కడికి వస్తాను అని ఆదేశించాడు.
విష్ణుచిత్తులవారు శ్రీవిల్లిపుత్తూర్ చేరగానే స్వామి రంగమన్నార్, అంటే రంగరాజుగా గరుడవాహనంపై గోదాదేవితో కల్సి వేంచేసాడు. శ్రీవిల్లిపుత్తూరులో అసలు దేవాలయం వటపత్రశాయిదే, కాని గోదాదేవి రంగనాథుడిని పొందాక, గోదాదేవి ఆలయం తర్వాత ప్రసిద్ది చెందినది. పెద్దగోపురం కనిపించేది వటపత్రశాయి ఆలయంకు చెందినది. ప్రక్కన గోదాదేవి నివసించే ఇల్లు ఆమె మందిరంగా ఉంది ఈనాటికి కూడా. ఆగోదాదేవి అలా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అవతరించి భూమినంతా తరింపజేసింది. తల్లి తన పిల్లల్ని స్తన్యముల ద్వారా పోశిస్తుందో, అలా గోదాదేవి తిరుప్పావై, నాచియార్ తిరుమొఱ్ఱి అనే రెండు దివ్యప్రబంధాలను లోకానికి ఇచ్చి జీవరాశినంతా పోశిస్తుంది.
రామచంద్రుడిని వివాహమాడిన సీతాదేవి కంటే గోదాదేవే ఒక్క అడుగు ముందు అని అంటుంటారు. ఇద్దరూ అయోనిజలే, భూమిలో లభించినవారు. యజ్ఞానికి అని మామూలు క్షేత్రాన్ని దున్నుతుంటే సీతమ్మ లభించింది, పరమాత్మకు అర్పించదగిన పరిశుద్దమైన తులసివనంలో మన అమ్మ గోదా లభించినది. తులసికి వేరు మొదలుకొని చివరిదాకా అణువణువునా పరిమళం నిండి ఉన్నట్టుగానే గోదాదేవి తనలో ఉండే ప్రతి ప్రవృత్తిలో కూడా శ్రీకృష్ణ ప్రేమ పరిమళం నిండి ఉంది. ఇక పెంచినవాడిని చూస్తే, జనక చక్రవర్తి కర్మ యోగి, పరిపాలకుడు. గోదాదేవిని పెంచిన విష్ణుచిత్తులు భక్త శిఖామణి, పరమ వైదికోత్తముడు. వంశంలో కూడా గోదా ఒక మెట్టు ఎక్కువే! ఇక చేపట్టిన వాడిని చూద్దామా అంటే ఆయన రాముడు, మరి గోదా చేపట్టిన ఆయన రంగనాథుడు, శ్రీరాముని ఇలవేల్పు. అంటే గోదాదేవి సీతారాములకే ఆరాధ్య స్థానాన్ని పొందింది. సీతాదేవి ఇలా చెయ్యండి అంటూ మనకేమి చెప్పలేదు, కాని గోదా దేవి మనకు ఎన్నో నియమాలు, ధర్మాలు నేర్పింది.రామచంద్రుడు ప్రక్కన ఉండగా లేడిని కోరి కష్టాలను తెచ్చి పెట్టుకుంది సీత, కానీ ఆండాళ్ తల్లి "ఉన్నై అరిత్తిత్తు వందోంమెం నిన్ను కోరివచ్చాం, "పఱై తరుతియాగిల్" నీవు ఇచ్చేవి కోరి రాలేదు అని చెప్పింది. దొంగని కాదు దండించేది, దొంగలోని దొంగ అనే ప్రవృత్తిని దండించాలి అని ఈనాడు పెద్ద పెద్ద దేశాలు చెబుతున్నారే ఆమాటలు గోదా మనకు ఎప్పుడో చెప్పింది. "మత్తారై మాత్త్-అఱిక్క వల్లాన్" శత్రువులలోని శత్రుత్వాన్ని దండించి తొలగించ గలిగేవాడు మా స్వామి అని ఎన్నో గొప్ప గొప్ప మాటల్ని తెలిపింది అమ్మ గోదా. ప్రకృతి సౌందర్యంలో భగవంతుణ్ణి ఎట్లా చూడాలో నేర్పింది అమ్మ గోదా. శాస్త్ర సారమైన ఎన్నో రహస్యాల్ని అందమైన పాటలుగా అందించింది గోదా. అలా గోదాదేవి ఒక మెట్టు ఎక్కువే, ఆమెకు సాటి ఎవ్వరులేరు. ఆమె పేరు పెట్టుకున్నందుకు గోదావరి నది పవిత్రం అయ్యింది. ఆమె శ్రీరంగంలో రంగనాథుడిని చేరినందువల్ల కావేరీ నది పవిత్రం అయ్యింది. తను స్వామి సన్నిదానం చేరే ముందు మనల్ని అందరిని భాగుచేస్తానని వాగ్దానం చేసింది. మరి స్వామి ఫలింప చేస్తాడా అంటే, ఆమెను పాణిగ్రహణం చేసాడంటే స్వామి ఒప్పుకున్నట్టే కదా. మార్గాన్ని మనం ఆశ్రయిస్తే చాలు మనం పరమాత్మను  తప్పక అందుకోగలం. గోదాదేవి ధరించి విడచిన మాలని కదా స్వామి ధరించాడు. అందుకే ఈనాటికి శ్రీవెంకటేశుడు బ్రహ్మోత్సవాల్లో శ్రీవిల్లి పుత్తూర్ నుండి గోదా ధరించిన మాలనే తెప్పించుకొని ధరించి, గోదా చేపట్టిని చిలుకనీ తాను చేత ధరించి, పొంగిపోతూ ఊరేగుతాడు. భగవంతుడికి గోదా ధరించిన మాల అంటే అంత ప్రేమ. ఆమె పాటలని మనం పాడుకోగల్గితే తరించిపోతాం.

వల్లూరి పవన్ కుమార్    

- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ 

No comments:

Post a Comment