శ్రీ వాసవీ కన్యక
ఓం శ్రీ వాసవాంబాయైనమః
ఓం కుసుమ పుత్రీచ విద్మహే
కన్యకుమారి ధీమహి
తన్నో వాసవీ ప్రచోదయాత్
ఉపోద్ఘాతం- చరిత్ర
స్త్రీలోని ఆత్మీయతకు,అనురాగానికి, సౌమ్యానికి, త్యాగగుణానికి, పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం ‘వాసవీ కన్యకా పరమేశ్వరి’.
సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత
గ్రంధ ఆధారంగా వాసవి కన్యకాంబ శ్రీపాద
శ్రీ వల్లభుల సహోదరి. 10వ, 11వ శతాబ్ధానికి
చెందిన కుసుమశ్రేష్ఠి-కుసుమాంబ (కౌసుంబి) దంపతుల గారాల బిడ్డ,పుణ్యాల
పంట వాసవాంబ. కుసుమ శ్రేష్ఠి వేంగి
దేశంలోని ‘వసాల్’ ప్రాంతాన్ని పాలించేవాడు. కుసుమ శ్రేష్ఠిని ఆ
రోజులలో అంతా పెద్ద శ్రేష్ఠి
(ఈ శ్రేష్ఠి పదం కాల క్రమేణా
శెట్టి గా రూపాంతరం చెందింది)
అని పిలిచే వారు. ప్రజలంతా ఎంతగానో
గౌరవించేవారు. ‘వసాల్’ దేశంలో పుట్టింది కనుక ఆమె ‘వాసవి’
అయింది. కన్యారాశిలో పుట్టింది కనుక ‘కన్యక’ అయింది.
వాసవి అమ్మను పూజించే వారిని శ్రేష్ఠులు అంటారు. ఈ పదమే వ్యవహారంలో
శెట్టి అయింది. ఈ శ్రేష్ఠులు గోదావరి
పరీవాహక ప్రాంతంలో ఉండి గోవును పూజించేవారు.
గోదావరిని స్థానికులు గోమతి అని పిలుస్తారు
అదేవిధంగా గోమాతను కుడా ‘గోమతి అని
స్థానికంగా వ్యవహరిస్తారు.’ . ఈ పేరే ‘గోమ్టి’గా మారింది. గోవును
పూజించే గోమతి తీర వాసులు
కనుక వీరిని ‘గోమట్లు’ అని పిలిచేవారు. ఈ
పేరే వ్యవహారంలో ‘కోమట్లు’గా మారింది.
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి
చరితామృతం
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి
గోమతీ లేదా ఆర్యవైశ్య కులస్తులకు
కులదేవత. ఈ కులస్తులు శ్రీ
వాసవీ కన్యకా పరమేశ్వరి జననం నకు ముందు
గోమాతను పూజించుట వల్ల వీరికి గోమతి
అను పేరు వచ్చింది. శ్రీ
పాద శ్రీ వల్లభుడు గో
ప్రియుడు.బహుశా ఈ కారణం
వల్లే ఆర్యవైశ్య కులస్తులంటే వారికి అబిమానం మెండు. ప్రస్తుతం ఈ కులస్తులు అధికంగా
ఆంధ్రప్రదేశ్లోను, ఇంకా తమిళనాడు,
కర్ణాటక రాష్ట్రాలలోను నివశిస్తున్నారు. అయితే మద్రాసు ప్రెసిడెన్సీకి
చెందిన వైస్రాయి 1921 మరియు 1931 మధ్య కాలంలో ఒక
కమీషన్ వేసారు . దాని ప్రకారం ప్రతి
కులానికి తమ పేర్లలో కోరిన
మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి అందరూ గోమతీ కులస్తులు
గల వైశ్య అసోసియేషన్(1905 లో
స్థాపించబడినది) వారు తమ పేరును
‘గోమతీ’ నుండి “ఆర్యవైశ్య” గా మార్చుకున్నారు.
ఆర్య అంటే గొప్ప వంశస్థుడు,
గౌరవింపతగినవాడు అని అర్ధం. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాల తరువాత
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
ఆర్య వైశ్యుల కులదేవత గా ఏర్పడ్డారు. శ్రీ
వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో
ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా
పరమేశ్వరీ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ ((జ్యేష్టశైలం/బృహత్శిలానగరం) అనే పట్టణంలో ఉన్నది.
ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని “వైశ్యుల కాశీ” గా భావిస్తారు.
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి
జననం
వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్టి వైశ్యులకు
రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు
(విమలాదిత్య మహారాజు) అనే చక్రవర్తి ఆధీనంలో
ఉండేది. క్రీ.శ. 10, 11వ
శతాబ్ధాలలో కుసుమశ్రేష్టి సుమారు 18 పరగణాలను జ్యేష్టశైలం/బృహత్శిలానగరం (పెనుగొండ) ను రాజధానిగా చేసుకుని
పాలిస్తూ ఉండేవాడు. కుసుమశ్రేష్టి, ఆయన భార్య కుసుమాంబ
ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. నగరేశ్వరస్వామి
(శివుడు) ఆరాధన వారి దైనందిన
జీవితంలో ఒక భాగంగా ఉండేది.
వివాహం అయిన చాల సంవత్సరాలకి
కూడా ఆ దంపతులకి సంతానం
కలుగలేదు. రాజ్యానికి వారసులు లేరని వారు చింతిచేవారు.
ఎన్ని ప్రార్ధనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు.
అపుడు వారు తమ కుల
గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా,
వారికి దశరధుడు చేసిన పుత్ర కామేష్టి
యాగాన్ని చేయమని చెప్పారు. అంతట ఒక పవిత్ర
కాలంలో వారు ఆ యాగాన్ని
తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి,
దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది
అని చెప్పారు. భక్తి,శ్రధలతో దాన్ని
ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా
అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో
జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ
సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం.
వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ
దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య
రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ
ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి
విరుపాక్షుడు అని అమ్మాయికి వాసవాంబిక
అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి
రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు.
వాసవి అన్ని కళలలోను ఆరితేరి,
సంగీతం మరియు తర్క శాస్త్రాలలో
మక్కువ చూపేది.
భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తిసాము మొదలైన యుద్ధవిద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క
శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయి గా పేరు తెచ్చుకుంది.
సహోదర వివాహక్షణాలు…
విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే
ఆలేరుకి చెందిన అరిధిశ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం
ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా
ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. అంతలో
విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో
భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమశ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం
పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు
చేసి ఘనమైన వేదిక పై
సన్మానాన్ని జరిపాడు. అదే రోజు ఆదిపరాశక్తి
పూజకు మంగళ వాద్యాలతో వెళ్లుచున్న
వాసవిని విష్ణువర్ధనుడు చూసి మోహించి వివాహమాడదలచాడు.
కుసుమశ్రేష్ఠికి వర్తమానం పంపాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి వాసవి దివ్య బాలికయని
కావున వివాహం సమ్మతం కాదని తెలుపగా ఒక
నెల రోజుల వ్యవది నిచ్చి
వివాహానికి సమ్మతించనిచో సైన్యంతో యుద్ధం చేసి వాసవిని తీసుకొని
పోతానన్నాడు. విష్ణువర్ధుని కోరిక కుశమశ్రేష్టికి శరాఘాతం
అయింది. ఆయన తన అంగీకారాన్ని
తెలుపలేడు, అలా అని కాదనలేడు.
దానికి కారణం ఆ రాజు
అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే
చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం
ఉంది. విష్ణువర్ధనుడు క్షత్రియుడు. ఇవి తల్చుకుని ఆయన
చాల ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను,
స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో
నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి
తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని
తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది.
అనంతర పరిణామాలు…
కుశుమశ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి
వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి
బలవంతంగా అయినా వాసవి ని
తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల
వైశ్యులు సామ, దాన, భేద,
దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.
ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమశ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు,
పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది, కాబట్టి
పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా,
మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం విష్ణువర్ధునుడితో
పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.
భాస్కరాచార్యులు
మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని
కాపాడుకోవాలని అన్నారు. ఈ మాటలు కుశుమశ్రేష్టికి
మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పని చేసాయి. తన
పక్షంలో కేవలం కొంత మంది
మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని విష్ణువర్ధునుడికి
ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి
చేయ రాదని నిశ్చయానికి వచ్చాడు.
ఈ సంఘటనతో వైశ్యుల మధ్య ఐకమత్యం దెబ్బతింది.
విష్ణువర్ధనుడు దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి,
తన సమస్త సేనలను కూడదీసుకుని
సంసిద్ధం అయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి
పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుశుమశ్రేష్టికి అండగా నిలిచారు. నాటి
సమావేశం లో మొదటిసారిగా వాసవాంబిక
తన ప్రతిస్పందనను సభాపూర్వకంగా తెలియజేసెను.
వాసవి దేవి ప్రతిస్పందన
వాసవి సభలోకి ప్రవేశించి, అందరిని ఉద్దేశించి ఈ విధంగా అంది-
”నేను వివా హానికి నిరాకరించినట్లయితే
విష్ణువర్ధనుడు సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాడు
. యుద్ధం వల్ల ఎంతోమంది సైన్యం
నశిస్తారు. అపార జననష్టం, ధననష్టం
జరుగుతుంది. ఎంతోమంది పునిస్త్రిలు వైధవ్యంతో బాధ పడతారు. తన
వల్ల ఇంత రక్తపాతం జరుగకూడదు.ఒక అమ్మాయి కోసం
మనం అంతా రక్తం ఎందుకు
చిందించాలి? మన స్వార్ధం కోసం
సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం.
దానికి బదులు ఒక కొత్త
పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం . దృడ
సంకల్పం, పట్టుదల ఉన్న వారు మాత్రమే
ఈ పోరాటంలో పాల్గొనగలరు”. వాసవి చెప్పిన విధానానికి
తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడి నడవడానికి
నిర్ణయించుకున్నారు.
అమర దీపం అసాధారణ త్యాగం…
ఆత్మార్పణ
వాసవి సూచనలను అనుసరించి, ఒకానొక మాఘ శుద్ధ పాడ్యమి
రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం
అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు
చేసారు. నగరం అంతా ఆ
రోజు పండుగ వాతావరణంలో ఉంది.
అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు
సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో
దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా
మనస్పూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం
చేసారు. వారు వాసవీ కన్యకాంబ
ని దేవుని అంశగా అనుమానించి, తమకి
నిజ రూపాన్ని చూపమని కోరారు. దానికి ఆమె ఆమె నవ్వి
తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన
వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి
ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని
చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల
ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి
ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి
దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను
అని చెప్పింది. కుశుమశ్రేష్టి గత జన్మలో సమాధి
అనబడే గొప్ప ముని. ఆయన
తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు.
అందుకే మీ అందరిని కూడా
ఆత్మ బలి దానానికి పురి
కొల్పాను అని అంది. ఆమె
అక్కడ చేరిన వారందరికీ దేశభక్తి,
నిజాయితి, సమాజ సేవ, సహనం
మొదలగు వాటి గురించి వివరించింది.ఆమె నోటి నుండి
పై పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో,
తిరిగి వాసవాంబిక రూపంలో ప్రత్యక్షం అయింది. వెంటనే వాసవాంబిక తనకు ఏర్పాటు చేయబడిన
అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ కావించుకొనెను.అప్పుడు 102 గోత్రాలకు చెందిన వారు కుడా తమ
ఇష్ట దైవాలను తల్చుకుని అగ్నిగుండంలో దూకారు
విష్ణువర్ధునుడి
మరణం
విష్ణువర్ధునుడికి
దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ
పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు వేగులు అప్పటి వరకు జరిగిందంతా విష్ణువర్ధునుడికి
చెప్పారు. ఆ వార్త విన్నవిష్ణువర్ధనుడు
రక్తం కక్కుని, తలపగిలి అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం,
విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం
అంతా మార్మోగిపోయింది. విష్ణువర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి
నాంది పలికిన వాసవి మరియు ఆమె
అనుచరులను కొనియాడారు.
అహింసే ముగింపు
ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని
కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణ పొలిమేరలకు చేరుకుని
విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు
వచ్చి అతన్ని ఈ విధంగా ఓదార్చాడు-”సోదరా, గతం నేర్పిన అనుభవాలు
పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా
వాసవాంబిక మన అందరిని రక్షించింది.
ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది.”
ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి
అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు.
పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి
అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా 101 శివలింగాలని ప్రతిష్టించాడు. రాజరాజ నరేంద్రుడు వాసవాంబిక గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు.
అప్పటి నుండి వైశ్యులందరూ వాసవీ
కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం
మొదలెట్టారు. వాసవీ కన్యకా పరమేశ్వ
జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు,మత విశ్వాసాన్ని నిలిపినందుకు,స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేసినందుకు గాను ఆమె ఎప్పటికి
అజరామరం అయింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో
ఒక విజేతగా,శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుంది.
శ్రీపాద శ్రీ వల్లభుడు – వాసవాంబిక
సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం
ప్రకారం ఆర్య మహాదేవి యొక్క
తేజో కిరణమే శ్రీ వాసవీ కన్యక.
అనసూయ మాత “అగ్నియోగం ” వల్ల
జన్మించిన కవలపిల్లలే శ్రీపాద శ్రీ వల్లభులు మరియు
శ్రీ వాసవీ కన్యక. శ్రీ
వాసవీ కన్యకా పరమేశ్వరి శ్రీపాద శ్రీ వల్లభుల సహొదరి.
ఆమె ముఖ వర్చస్సు సాక్షాత్తు
శ్రీపాద శ్రీ వల్లభుల వారిని
పోలిఉండును . శ్రావణ శుద్ధ పౌర్ణమి (రాఖీ
పౌర్ణమి) రోజు శ్రీపాద శ్రీ
వల్లభులు ఎక్కడున్నా బృహత్సిలానగరం దీనికే జ్యేష్టశైలం అనికుడా పేరు (పెనుగొండ) నకు
వచ్చెదరు . ఆ రోజు వాసవీ
కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల వారికి
రక్షా బంధనం కట్టుపుణ్య దినము.
ఆరోజు ఎవరైతే పిఠాపురం నందు శ్రీ పాదుల
వారి సన్నిధానం లో ఉంటారో వారికి
చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. శ్రీ వాసవీ కన్యకాంబ
నామస్మరణ ఎక్కడ చేయబడుచుండునో అక్కడ
గుప్త రూపం లో శ్రీపాద
శ్రీ వల్లభులు నివసించును. శ్రీపాద భక్త భందువులందరూ( వైస్యులైన
లేదా కాకున్నా ) తప్పనిసరిగా పిఠాపురం నకు 90 కి .మీ. దూరంలో
ఉన్నపశ్చిమ గోదావరి జిల్లలో గల పెనుగొండ లో
వేంచేసి ఉన్న శ్రీ వాసవీ
కన్యకాపరమేశ్వరి ని దర్శించుకుంటే మంచిది.
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ