పాములపర్తి వెంకట నరసింహారావు
జననం :28 జూన్ 1921, లక్నేపల్లి, వరంగల్ జిల్లా (తెలంగాణ, అప్పటి హైదరాబాదు సంస్థానం )
మరణం :డిసెంబరు 23, 2004 (వయసు 83), న్యూఢిల్లీ, భారతరత
భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే
ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు 1921, జూన్
28న జన్మించాడు. పి.వి.నరసింహారావు,
పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన
బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన
వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ
లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న
వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం
ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే
కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి
పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్
నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని
మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని
ఘనకార్యం.
రాష్ట్ర రాజకీయాల్లో పీవీ
1957 లో మంథని నియోజక వర్గం
నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.
ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు
సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు.
1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార
శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ
శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య
శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు
నిర్వహించాడు.
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ
కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే
పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో
చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది.
రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదు లో కంటే, ఢిల్లీలోనే
ఎక్కువ వీలు కుదిరేదని ఒక
రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.తాను ముఖ్యమంత్రిగా ఉండగా
భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట
పరిమితి చట్టం తెచ్చింది కూడా
పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే
ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.
కేంద్ర రాజకీయాల్లో పీవీ
తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం
ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.మొదటిసారిగా లోక్సభ కు
హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి
మళ్ళీ హనుమకొండ నుండే లోక్సభకు
ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్సభకు మహారాష్ట్ర
లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ
రాంటెక్ నుండే తొమ్మిదో లోక్సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల
లోక్సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన
ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్సభలో
అడుగుపెట్టాడు. 1980 -
1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల
అభివృద్ధి శాఖ లను వివిధ
సమయాల్లో నిర్వహించాడు.
ప్రధానమంత్రిగా పీవీ
ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది.
1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా
రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్
గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు
పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ
ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ
ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా
బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని
నంద్యాల లోక్సభ నియోజకవర్గం
నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా
చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి,
పీవీ లోక్సభలో అడుగుపెట్టాడు.
సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై
తెలుగు దేశం అభ్యర్ధిని పోటీలో
పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు
పార్టీకి అది చాలా క్లిష్టసమయం.
ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ
సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో
వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార
అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో
తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా
కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి
మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం
ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని
అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని
విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా. ప్రధానిగా ఉండగా
మన్మోహన్ సింగ్ ను ఆర్థిక
మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక
మార్పుకు నాంది పలికింది. మరొకవైపు
బాబ్రీ మసీదు కూలగొట్టడం కూడా
ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే
నెపం ఆయనపై ఉన్నది. పి.వి. పెయ్యనాకుడు విధానాన్ని
అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి, రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది. సమస్యలు వాటంతటవే సద్దుకుపోతుండేవి.
పీవీ విజయాలు
పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత
రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు,
పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు
ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న
ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన
ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి,
సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే,
ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ
సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే
కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా
ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే
ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు,
తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరానులతో సంబంధాలు
పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన
అనేక విజయాల్లో కొన్ని.
1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన
కాలంలోనే బాంబు తయారయింది. ఈ
విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు
పీవీ విశిష్టత
బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా,
17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర
సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా
అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచాడు.
పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన
పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి
దూరంగా ఉంచిన నిజాయతీపరుడు. అధికారాన్ని
వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి
చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకాగతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ.
కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ
నిండుకుండలానే ఉన్నారాయన.
2004 డిసెంబర్
23 న పి.వి.నరసింహారావు
కన్నుమూసాడు.
తెలంగాణ రాష్ట్రంలో పివి జయంతిని అధికారికంగా
ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయం.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ