Monday, 14 April 2014

హనుమజ్జయంతి

హనుమజ్జయంతి
యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"
శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.
ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.
శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.
ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్యవ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో "సానపట్టిన వజ్రము" వలె వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.
కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. అందువల్లనే!
యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్.
శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.

వల్లూరి పవన్ కుమార్    

- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ   


Monday, 7 April 2014

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు


శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
రామాయ రామభద్రాయ రామచంద్రయ వేధసే
రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః

ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా..
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా

శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా..
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా

క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా..
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా

వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా..
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా

జయతు జయతు మంత్రం ,జన్మ సాఫల్య మంత్రం -
జనన మరణ భేద క్లేశ విచ్చేద మంత్రం
సకల నిగమ మంత్రం ,సర్వ శాస్త్రైక మంత్రం –
రఘు పతి నిజ మంత్రం ,రామ రామేతి మంత్రం ||
వల్లూరి పవన్ కుమార్  
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ  

కల్యాణ రాముని అవతార కథ

కల్యాణ రాముని అవతార కథ
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.శ్రీ రామ నవమి పండుగను స్వామి జన్మదినంగాను, సీతా మాతతో కళ్యాణ మహోత్సవంగాను జరుపుకుంటారు. భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది.   ( ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. )
భగవంతుడు తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండి కడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును. భారత ఇతి హాసముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది.
పూర్వము వాల్మీకి యను మహర్షి శ్రీ మద్రామాయణము అను మహా కావ్యము వ్రాసెను. భారతీయులకు వాల్మీకి మొదటి కావ్యరచయిత; శ్రీ మద్రామాయణమే మొదటి కావ్యము . ఈ కావ్యము నుండి భగవంతుని దశావతారములు లోని రామావతారము గురించి మనకు తెలియుచున్నది.
భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది. శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి, ఇప్పటికిని అనగా త్రేతాయుగములో అవతరించి, ద్వాపరము అయి కలియుగము నడుస్తున్న ఈ నాటికి కూడా దేవునిగా కొనియాడబడుతూ శ్రీ రామ నవమి అను పేరున నవరాత్రములు, కళ్యాణ మహోత్సవములు జరిపించుకొనుచున్నాడు.
జన్మ వృత్తాంతం
త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సు చేసి వారిచే అనుగ్రహింపబడిన వర గర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక దేవతలను, ఋషులను, హరి (విష్టువు) భక్తులను వేధించుచుండెను. అప్పుడు వారందరు హరిని ప్రార్ధించి తమ కష్టములను మొర పెట్టుకొనగా, ఆ మహా విష్ణువు రామునిగా అవతరించి రావణుని కడతేర్చెద నని వారికి చెప్పి, వారిని శాంతపరచి పంపెను.
భూలోకమున అయోధ్యా నగర చక్రవర్తి దశరధుడు పుత్రుల కొరకై పుత్ర కామేష్టి యను యఙ్ఞమును చేయుచుండెను. ఆ యఙ్ఞమునకు సంతసించిన దేవతలు అగ్ని దేవుని ద్వారా దశరధునికి పాయసము ను పంపిరి. ఆ పాయసమును దశరధుడు తన మువ్వురు భార్యలకు అనగా కౌసల్య, సుమిత్ర,కైకేయి లకు పంచెను. కొన్నాళ్లకు యీ మువ్వురు భార్యలు గర్భవతులై నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. ఆ మహా విష్ణువే తన ఆది శేషువు, శంఖ చక్రములు, గదలతో సహా యీ నలుగురు పుత్రులుగా అవతిరించెను. రావణ సంహారము కొరకు అవతరించిన ఆనలుగురు పుత్రులే శ్రీరామ చంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు.
చైత్ర మాసమున, శుద్ధ నవమీ తిధినాడు, పునర్వసు నక్షత్రమున ఐదు గ్రహములు ఉచ్ఛంలో నుండగ కర్కాటక లగ్నమున గురుడు చంద్రునితో కలసి వుండగా, జగన్నాధుడు, సర్వలోకారాధ్యుడు , సర్వ లక్షణ సంయుతుడును అగు ఆ మహా విష్ణువు కౌసల్యాదేవి గర్భమున శ్రీరామ చంద్రమూర్తిగా జనియించెను. శ్రీరాముడు పూర్ణ మానవుడుగా జీవించెను.
రామ నవమి
శ్రీ రాముని జననమైన నవమి తిధి నాడే ఆయన వివాహము సీతా మహాదేవి తో అయినదట. అట్లే రాజ్య పట్టాభిషేకము కూడ నవమి నాడేనట. అందుకనే శ్రీరామ నవమి అని చైత్ర శుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాము.
విద్ధి విద్ధానం
ఆ రోజు మానవులందరూ తల స్నానము చేసి శుభ్రమైన లేక క్రొత్త బట్టలను ధరించి సీతారాముల పూజించి, కళ్యాణ మహోత్సవను జరిపించి, వసంత ఋతువు - ఎండాకాలము అగుటవలన పానకము, వడపప్పు ఆరగింపు చేసి ప్రసాదము పంచుదురు. దశమి నాడు పట్టాభిషేక ఘట్టము జరుపుదురు. కొందరు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు రామనవరాత్రోత్సవము జరుపుదురు. ఈ తొమ్మిది దినములందు రామాయణ పారాయణము, రాత్రులందు రామకధా కాలక్షేపము జరుపుదురు.
శ్రీ రామనవమి నుండి రామకోటి వ్రాయుట నారంభించి, మరుసటి శ్రీ రామనవమికి ఆ వ్రతము ముగించు ఆచారము కూడ కలదు. శ్రీ రామ నామము లక్ష, కోటి వ్రాసిన ఒక్కోక్క అక్షరమే మహా పాతకములను నశింపజేయునని శంకరుడు పార్వతికి చెప్పునట్లు భవిష్య ఉత్తర పురాణమున ఉమామహేశ్వర సంవాదమున వివరింపబడినది.
దేవుడైనను, మానవ రూపమున నున్న కారణమున ఆ శ్రీ సీతారాముడు, మానవుడు తన దుఃఖ ములలో , కష్ట నష్టములలో ఏ విధంగా స్పందించునో ఆ విధముగనే ప్రవర్తించి చూపుటయే గాకపితృవాక్య పరిపాలనము, సత్యసంధత, భ్రాతృప్రీతి, స్నేహ బంధము, ఏక పత్నీ వ్రతము, ఒకే మాట - ఒకే బాణము , మొదలగు కష్టతరమైన ధర్మాలను ఆచరించి చూపి తన శీల సంపదతో మానవ జాతికే కనువిప్పు కలిగించెను.
అందుకనే "శ్రీ సీతారాముల గుడి లేని గ్రామముండదు... శ్రీ రామ అని మొట్ట మొదట వ్రాయక, యే వ్రాతయూ వ్రాయబడదు" అను నానుడి వచ్చినది. ఆ విధంగా శ్రీ రామ నవమి మానవాళికి పర్వదినమైనది.

వల్లూరి పవన్ కుమార్  
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ